Shivam Dube టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుతంగా ఆడి భారత్కు భారీ స్కోర్ అందించిన శివమ్ దూబే మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల్లోనే రైలులో ముంబైకి ప్రయాణం చేయడం ఇప్పుడు ఆసక్తికర కథగా మారింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి విమానాలు అందుబాటులో లేకపోవడంతో అతను భార్య అంజుమ్, స్నేహితుడితో కలిసి ఉదయం సయాజీ ఎక్స్ప్రెస్ రైలులో టికెట్లు బుక్ చేసుకున్నాడు. అభిమానులు గుర్తించకుండా ఉండేందుకు క్యాప్, మాస్క్ ధరించి పై బెర్త్లో దాక్కున్నాడు. చివరకు బోరివలి వద్ద దిగేందుకు పోలీసుల సహాయం తీసుకున్నాడు.
శివమ్ దూబే పేరు ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2026 ఫైనల్ తర్వాత దేశవ్యాప్తంగా మార్మోగింది. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో లక్ష మందికిపైగా అభిమానులు దూబే.. దూబే అంటూ గర్జించిన కొన్ని గంటలకే భారత జట్టు ఈ లాస్ట్ యాక్షన్ హీరో మాత్రం సాధారణ ప్రయాణికుడిలా రైలులో ముంబైకి బయలుదేరడం ఇప్పుడు ఆసక్తికర కథగా మారింది.
ఫైనల్ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్లో దూబే మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి జట్టు స్కోర్ను 250 దాటించి టీమిండియా హీరోగా మారాడు. కానీ అలాంటి హీరో ఓ సాదాసీదా వ్యక్తిలా రైలులో ప్రయాణించాల్సి వచ్చింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్లే విమానాలన్నీ ఫుల్ అయిపోయాయి. దీంతో దూబే తన భార్య, ఒక స్నేహితుడితో కలిసి రైలులో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
అహ్మదాబాద్ నుంచి ముంబైకి విమానం దొరకలేదు. అందుకే ఉదయం రైలులో వెళ్లాలని నిర్ణయించుకున్నాం. రోడ్డుమార్గంలో వెళ్లొచ్చు కానీ రైలు వేగంగా చేరుతుందని భావించాం అని దూబే నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అహ్మదాబాద్ – ముంబై సయాజి ఎక్స్ప్రెస్ థర్డ్ ఏసీ కోచ్లో టికెట్లు దొరకడంతో వాటినే బుక్ చేసుకున్నట్లు తెలిపాడు.
మేము ముగ్గురం కలిసి రైలులో వెళ్లాలని నిర్ణయించుకున్నాం. థర్డ్ ఏసీ టికెట్లు బుక్ చేశాం. కానీ స్టేషన్లో లేదా రైలులో ఎవరో గుర్తిస్తే ఎలా ఉంటుందో అని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందారు. అందుకే నేను క్యాప్, మాస్క్ వేసుకున్నాను. ఫుల్ స్లీవ్ టీషర్ట్ వేసుకున్నాను. ఉదయం 5:10కు రైలు ఉండటంతో ప్లాట్ఫారమ్లో ఎక్కువ మంది ఉండరని అనుకున్నాం. కానీ టీమిండియా జెర్సీలు కనిపించడంతో మరో ప్లాన్ వేశాం. రైలు బయల్దేరే ఐదు నిమిషా వరకు నేను కారులోనే వేచి ఉంటాను. తర్వాత పరిగెత్తుకుంటూ రైలెక్కుతాను అని నా భార్యకు చెప్పాను. ఆ ప్లాన్ ప్రకారమే రైలు ఎక్కానని అని దూబే చెప్పాడు.
రైలెక్కిన వెంటనే తన సీటుకు వెళ్లి నేరుగా పై బెర్త్ ఎక్కేశాడు. కొద్దిసేపటికి టికెట్ చెకర్ వచ్చాడు. శివమ్ దూబే? ఎవరు అతను.. క్రికెటర్? అని అడిగాడు. అప్పుడు దూబే భార్య అంజుమ్ వెంటనే స్పందిస్తూ లేదు లేదు అతను ఎలా వస్తాడు అని చెప్పడంతో టికెట్ చెకర్ వెళ్లిపోయాడని దూబే వివరించాడు.
రాత్రి ఒకసారి వాష్రూమ్కి వెళ్లాను. అప్పటికీ ఎవరూ గుర్తించలేదు. ప్రయాణం బాగానే సాగింది. కానీ బోరివలీ స్టేషన్లో పగలు దిగాల్సి రావడం వల్ల మాత్రం కొంచెం టెన్షన్గా అనిపించింది. వాళ్లు నేను విమానాశ్రయానికి వస్తాననుకున్నారు. కానీ రైలులో వస్తున్నానని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. చివరకు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చారు. దీంతో సులభంగా బయటకు వచ్చాను అని చెప్పాడు.
టోర్నమెంట్లో మొత్తం 235 పరుగులు చేసి 39 సగటుతో, 169 స్ట్రైక్ రేట్తో ఆకట్టుకున్నాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేస్తూ 17 సిక్సర్లు, 15 ఫోర్లు బాదాడు. ఫైనల్లో కేవలం 8 బంతుల్లో చేసిన కీలక 26 పరుగులు భారత్ విజయంలో కీలకంగా మారాయి.
