2nd ODI: విశాఖ వన్డేకు వర్షం ముప్పు.. ఆందోళనలో ఫ్యాన్స్..

భారత్, ఆసీస్ వన్డే సమరానికి సాగరతీరం ముస్తాబైంది. అయితే ఈ మ్యాచ్ సవ్యంగా జరగడంపై సందిగ్థత నెలకొంది. మ్యాచ్ జరిగేరోజు ఆదివారం వర్షం పడే అవకాశాలుండడంతో..

  • Written By:
  • Publish Date - March 18, 2023 / 06:21 PM IST

భారత్, ఆసీస్ వన్డే (ODI) సమరానికి సాగరతీరం ముస్తాబైంది. అయితే ఈ మ్యాచ్ సవ్యంగా జరగడంపై సందిగ్థత నెలకొంది. మ్యాచ్ జరిగేరోజు ఆదివారం వర్షం పడే అవకాశాలుండడంతో అటు నిర్వాహకులు, ఇటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగినా అభిమానుల్లో ఉండే ఉత్సాహమే వేరు. హైదరాబాద్ లో రెగ్యులర్ గా జరుగుతున్నా.. ఏపీలో మాత్రం రొటేషన్ ప్రకారం మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చేందుకు ఏడాదికంటే ఎక్కువ సమయమే పడుతూ ఉంటుంది. ఇప్పుడు దాదాపు మూడేళ్ళ తర్వాత వన్డే (ODI) మ్యాచ్ కు విశాఖ వేదిక కాబోతోంది. ఇప్పటికే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారత్, ఆసీస్ వన్డే సమరం కోసం విశాఖ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు స్టేడియంలో ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. అయితే తాజాగా వారికి నిరాశ కలిగించే వార్త బయటకు వచ్చింది. ఆదివారం విశాఖ వన్డేకు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశముంది. ఉపరితలద్రోణి కారణంగా రెండురోజులుగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఆదివారం వర్షం పడే అవకాశముండడంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ కూడా వర్షం పడే అవకాశాలు 80 శాతం వరకూ ఉన్నాయి. ఏకధాటిగా వర్షం కురిసే అవకాశాలు లేవని మాత్రం తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే మ్యాచ్ ఓవర్లను కుదించే పరిస్థితి రావొచ్చు.అయితే వర్షం పడినా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉండడంతో తక్కువ సమయంలోనే గ్రౌండ్ ను సిద్ధం చేస్తామని క్యూరేటర్ చెబుతున్నారు. మరోవైపు మూడేళ్ళ తర్వాత జరుగుతున్న వన్డేకు వరుణుడు అడ్డుపడకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అటు ఇప్పటి వరకూ ఇక్కడ జరిగిన 9 వన్డేల్లో వర్షంతో ఒకసారి మాత్రమే మ్యాచ్ రద్దయింది. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించినా కనీసం టీ ట్వంటీ తరహా మ్యాచ్ అయినా జరగాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.

Also Read:  COVID-19: మళ్లీ కరోనా కలకలం.. 4 నెలల గరిష్టానికి కేసులు.. ఒకేరోజు 841 మందికి ఇన్ఫెక్షన్