మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ పేరుతో ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు అవినీతికి సంబంధించిన ఫిర్యాదుల కోసం కూడా దిశ యాప్ తరహాలోనే కొత్తగా ఓ యాప్ ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు హోంశాఖపై బుధవారం నాడు సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…అవినీతి కేసులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఓ యాప్ ను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ యాప్ నెల రోజుల్లోగా అందుబాటులోకి రానుంది. ఈ యాప్ కు ఆడియో క్లిప్ ను పంపి కూడా అవినీతిపై ఫిర్యాదు చేయవచ్చు. అవినీతి కేసుల నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల వరకే ఉన్న ACBస్టేషన్లను ఇకపై మండల స్థాయి వరకు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.