Chiranjeevi : చిరంజీవి పై కుట్ర పన్నేది ఎవరు..? జనసేన నేత సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఆయన "పక్క రాష్ట్రం" లేదా "పొరుగు రాష్ట్రం" అని సంబోధించడాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు

Published By: HashtagU Telugu Desk
Chiranjeevi Speech Gaddar A

Chiranjeevi Speech Gaddar A

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఆయన “పక్క రాష్ట్రం” లేదా “పొరుగు రాష్ట్రం” అని సంబోధించడాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు. చిరంజీవిపై జరుగుతున్న ఈ నెగిటివ్ ప్రచారం వెనుక ఒక పథకం ప్రకారం సాగుతున్న రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. కేవలం యూట్యూబ్ లైకుల కోసం, వ్యక్తిగత లాభాల కోసం మెగాస్టార్‌ను టార్గెట్ చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు.

చిరంజీవి వ్యాఖ్యల్లోని అంతరార్థాన్ని వివరిస్తూ.. ఆయన ప్రస్తుతం తెలంగాణలో నివసిస్తున్నారు కాబట్టి ఏపీని పొరుగు రాష్ట్రం అనడంలో సాంకేతికంగా ఎలాంటి తప్పు లేదని వెంకటేశ్వరరావు సమర్థించారు. పైగా, ఏపీలో కూడా కళాకారులను ప్రోత్సహించాలని, అవార్డుల కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అత్యంత వినమ్రంగా కోరారని గుర్తుచేశారు. సినిమా రంగానికి అత్యంత సన్నిహితుడైన చంద్రబాబు గారు ఈ దిశగా అడుగులు వేయాలని చిరంజీవి కోరడం ఆ రాష్ట్ర సినిమా అభివృద్ధి కోసమే తప్ప, విమర్శించడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారు గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు.

కూటమి ధర్మం మరియు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాము ప్రస్తుతం ఎంతో ఓపికగా ఉన్నామని, అయితే చిరంజీవి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పోస్టులు పెడితే సహించేది లేదని జనసేన నేత తేల్చి చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని, కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడితే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. “దురద పుడితే జాలీమ్ లోషన్ రాసుకోవాలి కానీ, చిరంజీవిపై పడి ఏడవద్దు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కుట్రల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని, త్వరలోనే వారి అసలు రంగు బయటపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

  Last Updated: 23 Mar 2026, 09:27 PM IST