బీజేపీ ప్రభుత్వం హామీలు ఆకాశంలో, వాటి అమలు పాతాళంలో ఉందని తీవ్రంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లిలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలిపిన పార్టీగా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిపక్షాలకు సమాధానం చేప్పాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ హయాంలో జీడీపీ నేల మీద, నిత్యావసర ధరలు ఆకాశంలో ఉన్నాయన్న ఎమ్మెల్సీ కవిత, మోడీ హైతో ముష్కిల్ హై అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయని చెప్పారు. అవినీతి రహితంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డలకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. దేశంలో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిన పార్టీ టీఆర్ఎస్ అని కవిత స్పష్టం చేశారు.
తెలంగాణ తెచ్చుకున్నది యువత కోసమని, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశామని వెల్లడించారు. స్థానికతకు సంబంధించిన జీవో రెండేండ్ల పాటు కేంద్రం పెండింగ్లో పెట్టినా ఓపిక పట్టామని చెప్పారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావాలని సూచించారు. గతంలో 7 వేల మంది బీసీ విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ హాస్టల్ సౌకర్యం ఉండేదని, ప్రస్తుతం 281 బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేశామని కవిత అన్నారు. రూ.1300 కోట్లతో లక్షా 32 వేల వెనుకబడిన తరగతుల విద్యార్థులను చదివిస్తున్నామని వెల్లడించారు. 96 లక్షల విద్యార్థులకు రూ.8 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చామని కవిత తెలిపారు. ఎంపీ అర్వింద్ అబద్ధాలకు ప్రతిరూపమని కవిత విమర్శించారు. పనిచేయ చేతగాదు కానీ అబద్ధాలు చెప్పుకుంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ చేసిన పనులను కూడా తామే చేసినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని వెల్లడించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రజలు కోరిన విధంగా కోరుట్ల, మెట్ పల్లి రెవెన్యూ డివిజన్లు, వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామన్న ఎమ్మెల్సీ కవిత, కోరుట్ల నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీకి పెట్టని కోట అన్నారు. కాంగ్రెసోళ్లు రైతు రచ్చబండ పేరుతో గ్రామాలకు వస్తే ప్రకృతివనాలు, డంప్యార్డులు, శ్మశాన వాటికలు చూపించాలన్నారు. తెలంగాణకు రావాల్సిన బకాయిలపై పార్లమెంటులో మాట్లాడాలని రాహూల్ను ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కోరాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో జగిత్యాలలో ఉన్న అన్ని నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.