చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో తండ్రీకొడుకులతోపాటు ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. చిత్తూరు పట్టణంలోని పేపర్ ప్లేట్ల తయారీ కర్మాగారంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.హుటాహుటిన రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి.ఈ ఘటనలో చనిపోయిన వారు ఫ్యాక్టరీ యజమాని భాస్కర్ (65), అతని కుమారుడు డిల్లిబాబు (35), బాలాజీ (25)గా గుర్తించారు. డిల్లీ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అయితే సెలవులకు వచ్చిన ఢిల్లీబాబు యూనిట్లో తన తండ్రికి సహాయం చేసేవాడు. పుట్టిన రోజున తండ్రితో కలిసి మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్రవిషాదాన్ని నింపింది. షార్ట్సర్క్యూటే ఘటనకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.