ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రంజుగా సాగుతోంది. సీఐడీ పోలీసలు నిన్న అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ బాబును కలిసేందుకు గుంటూరు సీఐడీ ఆఫీస్ వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నపలువురు టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేత దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేయడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు.
అశోక్ బాబును కలిసేందుకు టీడీపీ నేతలు దేవినేని ఉమ, వెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తి వంటి పలువురు టీడీపీ నేతలు గుంటూరులోని సీఐడీ ఆఫీసుకు వెళ్ళారు. అయితే అశోక్ బాబును కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారితో దేవినేని ఉమ గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో దేవినేని ఉమను అరెస్టు చేశారు. దీంతో ఏపీ సీఐడీ పోలీసుల తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ బాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు ఆపకపోతే, జగన్ సర్కార్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.