Site icon HashtagU Telugu

USA: కిమ్ ను అదుపుచేయడం కోసం మరో అణు జలాంతర్గామి?

Usa

Usa

అమెరికాకు చెందిన రెండో అణుశక్తి జలాంతర్గామి దక్షిణ కొరియాలో లంగరేసింది. లాస్‌ ఏంజెల్స్‌ శ్రేణికి చెందిన యూఎస్‌ఎస్‌ అన్నాపోలిస్‌ జలాంతర్గామి జిజు ద్వీపంలో ఆగింది. ఉత్తరకొరియా క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగాలు నిర్వహించిన కొన్ని గంటల్లోనే అమెరికా అణు జలాంతర్గామి ప్రత్యక్షం కావడం గమనార్హం. కాగా శ్రతువుల నౌకలు, జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి అమెరికా ఈ సబ్‌మెరైన్‌ను ఉపయోగిస్తోంది. యూఎస్‌ఎస్‌ అన్నా పోలీస్‌లో ఒక న్యూక్లియర్‌ రియాక్టర్‌ కూడా ఉంది.

కాగా తాజాగా జిజు ద్వీపం నుంచి ఈ సబ్‌మెరైన్‌ కు అవసరమైన నిత్యావసరాలను సేకరిస్తోంది. కానీ, ఉత్తరకొరియా మాత్రం అమెరికా నౌకాదళం దక్షిణ కొరియాకు శిక్షణ ఇస్తోందని అందుకే ఈ జలాంతర్గామి వచ్చిందని అనుమానిస్తోంది. అయితే వారం క్రితం అమెరికా అణు క్షిపణులను ప్రయోగించే సామర్థం ఉన్న జలాంతర్గామి యూఎస్‌ఎస్‌ కెంటకీ బుసాన్‌ రేవుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ఇక్కడ ఉద్రిక్తతను మరింత పెంచింది. ఈ అంశమే తాము దక్షిణ కొరియాపై అణుదాడి చేయడానికి కారణం కావచ్చని ఉత్తరకొరియా రక్షణ మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. కాగా 1980ల తర్వాత ఒక ఎస్‌ఎస్‌బీఎన్‌ ఆ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి.

ఒక అమెరికా సబ్‌ మెరైన్‌ దక్షిణ కొరియా జాలాల్లోకి గత వారం వచ్చింది. ఇది జరిగిన వారంలోపే మరో అణుశక్తి జలాంతర్గామి రావడం గమనార్హం. ఉత్తర కొరియాలోకి చొరబడి అక్కడి దళాలకు దొరికిపోయిన అమెరికా సైనికుడు ట్రావిస్‌ కింగ్‌ అప్పగింతపై చర్చలు మొదలయ్యాయి. యునైటెడ్‌ నేషన్స్‌ కమాండ్‌, ఉత్తరకొరియా ఈ చర్చలు చేపట్టాయి. ఈ విషయాన్ని అమెరికా నేతృత్వంలోని మల్టీనేషనల్‌ కమాండ్‌ వెల్లడించింది. కొరియా యుద్ధం సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా ఈ చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.