KTR: బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రవాస భారతీయులంతా కలిసి రావాలి- మంత్రి కేటీఆర్

భారత రాష్ట్ర సమితి గెలుపు కోసం ప్రవాస భారతీయులంతా కలిసి రావాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

  • Written By:
  • Publish Date - October 28, 2023 / 06:19 PM IST

KTR: భారత రాష్ట్ర సమితి గెలుపు కోసం ప్రవాస భారతీయులంతా కలిసి రావాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ గారితో కలిసి కదం తొక్కి తెలంగాణ సాధించుకొని, తెలంగాణ నిర్మాణంలోనూ అనేక పర్యాయాలు, అనేక సందర్భాలు కలిసి నడిచిన ఎన్నారైలు ఈ కీలక సందర్భంలోనూ మరింత చురుగ్గా పనిచేయాలని కోరారు. ఈరోజు భారత రాష్ట్ర సమితికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నా ఎన్ఆర్ఐ శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అద్భుతంగా అన్ని రంగాల్లో ప్రగతి పథంలో తీసుకెళుతున్న కేసిఆర్ గారి నాయకత్వం మరోసారి తెలంగాణకి అవసరమనే విషయాన్ని తమ తమ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. జీవితంలో ఉన్నత చదువులు చదివి, వ్యాపార వాణిజ్య రంగాల్లో రాణించి విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు అంటే గ్రామాల్లో గొప్ప గౌరవం ఉందని, ఇలాంటి ప్రవాస భారతీయులు తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగే నాయకత్వానికి ఎన్నికలలో ఓటు వేయాలని కోరితే ఇక్కడి ఓటర్లు వింటారని కేటీఆర్ అన్నారు. రానున్న 30 రోజులు తెలంగాణ రాష్ట్రానికి సైతం అత్యంత కీలకమని, ఒకప్పుడు కాంగ్రెస్ వలన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి 60 సంవత్సరాలు అనేక బాధలకు గురైందన్నారు. మరోసారి దారితప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 50 సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధి వెనక్కి పోతుందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాలలో కెసిఆర్ గారి ఆధ్వర్యంలో సాధించిన ప్రగతి దృష్టిలో ఉంచుకొని ప్రజల మద్దతు కోరాలని ఎన్నారైలకు సూచించారు. ఇందుకోసం తమ తమ సామాజిక మాధ్యమాల ఆధారంగా గత తెలంగాణ కష్టాలను, ప్రస్తుతం తెలంగాణ సాధించిన అభివృద్ధిని వివరిస్తూ వీడియోలు, పోస్టుల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. ప్రవాస భారతీయులు సామాజిక మాధ్యమాలలో మరింత చురుగ్గా ఉంటూ, తెలంగాణ రాష్ట్రానికి భారత రాష్ట్ర సమితి అవసరాన్ని, ఆవశ్యకతను వివరించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, బిఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పాల్గొన్నారు