Shariat Vs Yogi : ‘‘ముస్లింలు దేశంలోని అన్ని సంక్షేమ పథకాలను అందరితో సమానంగా వాడుకుంటున్నారు. అలాంటప్పుడు రాజ్యాంగంలోని అన్ని చట్టాలను కూడా వాళ్లు అందరిలా ఫాలో కావాలి’’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కామెంట్ చేశారు. దేశ రాజ్యాంగం కంటే షరియత్ పెద్దది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని యోగి స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానెల్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కామెంట్స్ చేశారు. ‘‘షరియత్ మీ వ్యక్తిగత అంశం కావచ్చు.. కానీ అది రాజ్యాంగానికి అతీతమైనది కాదు. మేం మదర్సాలను ఆధునీకరిస్తున్నాం. మన దేశానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. అందుకు తగ్గట్టుగానే మన విద్యా సంస్థలను తీర్చిదిద్దుతాం’’ అని ఆయన పేర్కొన్నారు.‘‘హిందువు భారతదేశానికి ప్రాథమిక ఆత్మ. వారిని అవమానించవద్దు. సెంటిమెంట్ను కించపరిచే రాజకీయాలు చేయొద్దు. దేశ భద్రత, హిందువుల విశ్వాసం ఈ రెండు అంశాల పట్ల మనం రాజీ పడలేం’’ అని యోగి తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘మేం ఉత్తరప్రదేశ్లో కర్ఫ్యూ విధించడం లేదు. అల్లర్లు లేని రాష్ట్రంగా యూపీని తీర్చిదిద్దాం. 2017 నాటి అయోధ్యతో పోలిస్తే.. ఇప్పటి అయోధ్యలో అవకాశాలు 100 రెట్లు పెరిగాయి. లక్షల మందికి ఉపాధి లభించింది. భగవంతుని దయ అందరికీ ఉండాలి’’ అని యోగి ఆదిత్యనాథ్(Shariat Vs Yogi) ఆకాంక్షించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. చట్టానికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉండబట్టే.. అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ మళ్లీ ఢిల్లీ సీఎం కాగలిగారని చెప్పారు. ప్రజాస్వామ్యం ఏ ఒక్క వ్యక్తిని లేదా పార్టీని లేదా సంస్థను దోపిడీ చేయడానికి అనుమతించదన్నారు. ‘‘ముఖ్యమంత్రి రాష్ట్రానికి యజమాని కాదు. మా పని పబ్లిక్ సర్వీస్ మాత్రమే’’ అని యోగి స్పష్టం చేశారు.