టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఆరోపణల కేసులో రిమాండ్ లో ఉన్నారు. గత 20 రోజులుగా ఆయన జైల్లో ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఏపీలో రిలే నిరాహారదీక్షలతో పాటు కొంతమంది నాయకులు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. ఇటు పక్క రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు మద్దతుగా ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ ఈ రోజు రాత్రి 7గంటల నుంచి 7.05 నిమిషాల వరకు మోతమోగిద్ధాం అనే కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది. నారా బ్రాహ్మణి పిలుపుతో టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణలో చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఇటు తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ మోతమోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. గంట కొట్టి ఆమె చంద్రబాబుకి తన మద్దతు తెలిపారు.