కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం అర్థరాత్రి రాజీవ్ గాంధీ నగర్లో నివాసం ఉంటున్న మాదిగ హరిబాబు అనే 22 ఏళ్ల వాలంటీర్ దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం ఉదయం అతని మృతదేహం లభ్యమైంది. హరిబాబు భరత్ నగర్ సచివాలయం పరిధిలో వాలంటీర్గా పనిచేస్తున్నారు. రాళ్లు, మారణాయుధాలతో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు ఆదోని డీఎస్పీ జె.శివన్నారాయణ స్వామి తెలిపారు. స్థానిక టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ దారుణ హత్యకు గల కారణాలు తెలియరాలేదని దర్యాప్తు చేసి హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు.