MLC Kavitha: పూలే విగ్రహ ఏర్పాటు కోసం ఇందిరా పార్కు వద్ద మహాధర్నా: ఎమ్మెల్సీ కవిత

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 12:11 PM IST

MLC Kavitha: అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం మేధావులు, బీసీ సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి భారత జాగృతి చేపట్టిన ఉద్యమాన్ని సంఘీభావంగా అన్ని బీసీ సంఘాల నాయకులు ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం నాడు హైదరాబాద్ లో కలిసి అభినందించారు. ఇప్పటికే రూపొందించిన కార్యాచరణ పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ బీసీ హక్కుల కోసం ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దాంతో సుదీర్ఘ చర్చలు జరిపి బీసీ డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరిట ఉద్యమాలు చేపట్టాలని అందరు కలిసి నిర్ణయించారు. భారత జాగృతి సమన్వయంతో యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరిట ఉద్యమాలు చేపడుతామని పేర్కొన్నారు.

కార్యాచరణలో భాగంగా ఫిబ్రవరి రెండో వారంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టాలని నిర్ణయించారు. దీనికి అన్ని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం ఫిబ్రవరి 5 నుంచి 10వ తేదీల మధ్య అన్ని జిల్లాలతో పాటు విశ్వవిద్యాలయాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వంపై క్షేత్రస్థాయి నుంచి ఒత్తిడి పెంచడానికిగానూ ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఫ్రంట్, జాగృతి ప్రతినిధులు వెళ్లి వినతి పత్రం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 11న పూలే జయంతిలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలని డిమాండ్ చేశారు. అనంతరకాలంలో కులగణన, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తదితర బీసీ డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని ఫ్రంట్ నాయకులు ప్రకటించింది.

మంగళవారం నాడు హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో బీసీ నాయకులు వీ ప్రకాశ్, గట్టు రామచందర్ రావు, పల్లె రవికుమార్ గౌడ్, జూలూరి గౌరిశంకర్, ఆంజనేయులు గౌడ్, గెల్లు శ్రీనివాస్, దూదిమెట్ల బాలరాజ్ గౌడ్, విప్లవ్ కుమార్, రాజారాం యాదవ్, సర్దార్ రవీందర్ సింగ్, దావ సురేశ్, మఠం బిక్షపతి భారత జాగృతి నాయకులు రాజీవ్ సాగర్, నవీన్ ఆచారి, పద్మశాలి సంఘం నాయకుడు బొల్ల శివశంకర్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని భారత జాగృతి డిమాండ్ చేసిన మరునాడే సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి బీసీల జనగణన, రిజర్వేషన్లపై చర్చించారని గుర్తు చేశారు. ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమోదించిన 9 తీర్మానాలకు విశేష స్పందన వస్తోందని, మంత్రులు తమపై విమర్శలు చేస్తున్నారంటే బీసీ ఎజెండాపై కదలిక వస్తున్నట్లు అర్థమని స్పష్టం చేశారు. తమ డిమాండ్లకు గానూ బీఆర్ఎస్ తో పాటు సీపీఐ, సీపీఐ ఎంఎల్ వంటి వామపక్ష పార్టీల నుంచి మద్ధతు లభించిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపు 9 నెలల పాటు అలుపెరగకుండాఉద్యమించి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును సాధించుకున్నామని వివరించారు. అంబేద్కర్ విగ్రహాన్ని సాధించిన భారత జాగృతి సంస్థ పూలే విగ్రహం కోసం కూడా పోరాటం చేసి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.