Padmarao Goud: ఎంపీగా గెలిపిస్తే క్రిస్టియన్ల సమస్యలపై పార్లమెంట్ లో గొంతెత్తి ప్రశ్నిస్తా

  • Written By:
  • Updated On - May 6, 2024 / 04:04 PM IST

Padmarao Goud: క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి గత బీఆర్ఎస్ సర్కార్, వ్యక్తిగతంగా నిరంతరం శ్రమించామని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ లోని ఎస్.పీ.జీ. చర్చ్ పారిష్ హాల్ లో సోమవారం సభాద్యక్షులుగా వ్యవహరించిన తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన సికింద్రాబాద్ క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనంలో పద్మారావు గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ చర్చిలు, క్రైస్తవుల స్మశాన వాటికల అభివృద్ధితో పాటు క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. అలాగే రాబోయే కాలంలో క్రిస్టియన్ల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. తనకు మద్దతుగా నిలిచి ఎంపీగా గెలిపిస్తే క్రిస్టియన్ల సమస్యలపై పార్లమెంట్ లో గొంతెత్తి ప్రశ్నిస్తానని వివరించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కేంద్రంలో ఎవరు ఉన్నసరే వారిపై ఒత్తిడి తెచ్చి క్రిస్టియన్ల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. క్రైస్తవుల గొంతుకగా నిలిచే తనను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని ఈ సమ్మేళనానికి హాజరైన వారిని కోరారు.

అలాగే మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అంటేనే సెక్యులర్ అనే దానికి పర్యాయపదంగా నిలుస్తుందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సెక్యులర్ విధానాలను పాటించి, మైనారిటీలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు.దశాబ్దాలుగా రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ క్రైస్తవుల అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. అలాగే బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర పన్నుతుందని దుయ్యబట్టారు. నేడు ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీ గొంతులను పార్లమెంట్ కు పంపకపోతే రాజ్యాంగానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తూట్లు పొడుస్తాయని తెలిపారు. అందుకే ఈ సారి సికింద్రాబాద్ ఎంపీగా పద్మారావు గౌడ్ గారిని గెలిపించాలని కోరారు.

ఈ సమ్మేళనానికి విచ్చేసిన సీఎస్ఐ, ప్రీ మెథడిస్ట్, బాపిస్ట్, సాల్వషన్ ఆర్మీ, క్యాథలిక్ అసోసియేషన్, దళిత సంఘాల ప్రతినిధులు, అలాగే సికింద్రాబాద్, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పాస్టర్లు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ నీ ఆశీర్వదించారు.