బీజేపీ సీనియర్ నేత, బెంగాల్ మాజీ గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి (88) (Keshari Nath Tripathi) ఆదివారం ఉదయం 5 గంటలకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కన్నుమూశారు. యూపీ శాసనసభకు మూడుసార్లు స్పీకర్గా పనిచేసిన ఆయన చేయి విరగడం, శ్వాస సంబంధిత సమస్యలతో డిసెంబర్లో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వారం రోజులకుపైగా ICUలో చికిత్స పొందిన అనంతరం త్రిపాఠిని ఇంటికి తీసుకువచ్చారు. ఇంటి దగ్గర ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. త్రిపాఠి రెండుసార్లు కోవిడ్ వైరస్ బారిన పడ్డారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGIMS)లో సుదీర్ఘ చికిత్స తర్వాత కోలుకున్నారు.
Also Read: 1 Dead, 3 Injured: కుప్పకూలిన బిల్డింగ్.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
అలహాబాద్లో నవంబర్ 10, 1934న జన్మించిన కేశరీ నాథ్ త్రిపాఠి బీహార్, మేఘాలయ, మిజోరాం గవర్నర్గా కొద్దికాలంపాటు అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆరుసార్లు ఉత్తరప్రదేశ్ శాసనసభకు సభ్యుడిగా ఉన్నారు. అతను 1977 నుండి 1979 వరకు జనతా పార్టీ హయాంలో యూపీలో సంస్థాగత ఆర్థిక, అమ్మకపు పన్ను శాఖ మంత్రిగా పనిచేశాడు. త్రిపాఠి అలహాబాద్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అతను రచయిత, కవి కూడా. అనేక పుస్తకాలను రచించాడు. అతని ప్రధాన సాహిత్య రచనలు ‘మనోనుకృతి’ ‘ఆయు పంఖ్’ అనే రెండు సంకలనాలు. ఆయన రాసిన ‘సంచయిత: కేశరీ నాథ్ త్రిపాఠి’ అనే పుస్తకం పలువురి ప్రశంసలు అందుకుంది.
