హైదరాబాద్ శివార్లలోని ఐడీఏ బొల్లారంలోని స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. బాయిలర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను హైదరాబాద్లోని కూకట్పల్లి ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుడు హేమంత్ (28)గా గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పేలుడుకు గల కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.