మరికొన్ని రోజులలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారా అనే ఆసక్తి విద్యార్థుల తల్లిదండ్రులలో నెలకొంది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకం అర్హుల జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలంటూ అధికారులను ఆదేశించారు. పాఠశాలలు తెరుచుకున్న రోజే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులు, షూలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జూన్ నెల మధ్యలోకి వచ్చేసింది. మరికొన్ని రోజులలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తల్లికి వందనం నిధులు ఎప్పుడు విడుదలవుతాయా అనే ఆసక్తి విద్యార్థుల తల్లిదండ్రులలో వ్యక్తమవుతోంది. పాఠశాలలు తెరుచుకునే సమయం కావడంతో విద్యార్థుల చదువులు, పుస్తకాలు వంటి అవసరాలకు ఆ డబ్బులు అవసరమవుతాయనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉన్నారు. ఈ క్రమంలోనే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తల్లికి వందనం పథకం అర్హుల జాబితాను పారదర్శకంగా సిద్ధం చేయాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో.. బుధవారం రోజున శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలు ప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, షూస్ అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అండగా నిలిచేలా ‘తల్లికి వందనం’ పథకం అర్హుల జాబితాను పూర్తి పారదర్శకంగా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధికారులు పనిచేయాలని.. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, తాగునీరు, టాయిలెట్లు, ఆర్వో ప్లాంట్లు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న మంత్రి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. మరోవైపు తల్లికి వందనం పథకం బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. 15 వేలలో రూ.2000 పాఠశాల నిర్వహణకు పోనూ మిగతా రూ.13,000లను విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలలో జమచేస్తున్నారు. గతేడాది సుమారుగా 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు తల్లికి వందనం పథకం సాయం అందించారు. ఇంట్లో ఎంతమంది అర్హులైన విద్యార్థులు ఉంటే.. అంతమందికి కూడా తల్లికి వందనం సాయం అందిస్తున్నారు.
తల్లికి వందనం డబ్బులు రావాలంటే.. ఈ పనులు తప్పనిసరి.
మరోవైపు తల్లికి వందనం డబ్బులు పొందాలంటే విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతా.. ఆధార్ నంబరుతో అనుసంధానమై ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్లకు NPCI లింకింగ్ అనేది తప్పనిసరి. ఈ విషయాలు సక్రమంగా ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తల్లికి వందనం అర్హుల జాబితాను రూపొందించిన తర్వాత స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలలో ప్రదర్శిస్తారు. ప్రస్తుతం అర్హుల జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతోంది.
