Minister Sridhar Babu: తెలంగాణతో వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పేందుకు బల్గేరియా ఆసక్తితో ఉందని భారత్ లో ఆ దేశ రాయబారి డా.నికోలాయ్ యాంకోవ్ వెల్లడించారు. బుధవారం నాడు ఆయన సచివాలయంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో (Minister Sridhar Babu) భేటీ అయ్యారు. ఆ దేశపు గౌరవ కాన్సులేట్, సుచిర్ ఇండియా ఇన్ ఫ్రా సిఇఓ డా. కిరణ్ కుమార్ ఆయనతో ఉన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఒక కామన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు శ్రీధర్ బాబు అంగీకరించారు.
Also Read: Cyclone Fengal Updates: తీవ్ర వాయుగుండం.. మరో 12 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం!
నూతన ఆవిష్కరణలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ లో తమ రాష్ట్రంలో అద్భుతమైన ఎకోసిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీధర్ బాబు ఆయనకు వివరించారు. త్వరలో ఇరు దేశాల ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపాలని శ్రీధర్ బాబు చేసిన ప్రతిపాదనకు డా.నికోలాయ్ యాంకోవ్ సంసిద్ధత వ్యక్తం చేసారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు చింతకుంట వెంకటరమణా రావు (పెద్దపల్లి), మందుల సామేల్ (తుంగతుర్తి), పరిశ్రమల శాఖ కమిషనర్ డా. మల్సూర్, టీజీఐఐసీ సిఇఓ వి. మధుసూదన్ లు కూడా పాల్గొన్నారు.