BRS MLC: రాష్ట్రమంతా పింక్ వేవ్: కల్వకుంట్ల కవిత

రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

  • Written By:
  • Publish Date - November 15, 2023 / 02:42 PM IST

BRS MLC:  రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తోందని, మూడో సారి సీఎం కేసీఆర్ అధికారంలోకి పచ్చి దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలన్న ఆశతో ఉన్నారని చెప్పారు. “సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు. కేసీఆర్ అంటే ప్రేమకు పరాకాష్ట. ” అని వ్యాఖ్యానించారు. గులాబీ జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు ఇదే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

అందరూ పిడికిలి ఎత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బందూక్ పట్టుకొని ప్రజల మీదకి పచ్చిన విషయాన్ని మరిచిపోతారా అని అడిగారు. రైతుబంధును రైతులకు బిచ్చమేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, పెన్షన్లు, బీమా వృధాగా ఇస్తున్నామని కూడా అంటున్నారని, అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రేపు పొరపాటున అధికారంలోకి వస్తే కనీసం ప్రజలను పట్టించుకుంటారా అన్నది ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారం అని తెలిపారు.

గ్రామల్లో తెలంగాణ అభివృద్ధిపై చర్చించాలని కోరారు. ఉమ్మడి పాలనలో ఒక్క ప్రభుత్వమైనా రైతుల గురించి ఆలోచించి ఒక్క పైసా అయినా ఇచ్చిందా అని అడిగారు. లక్షలాది పేద ఇంటి ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో ఎవరైనా ఈ ఆలోచన చేశారా అని అడిగారు. మరి ఏమీ చేయని ఎందుకూ పనికిరాని వాళ్లు, ఒక్క నీటి బొట్టును కూడా ఇవ్వనివాళ్లు ఇవాళ సీఎం కేసీఆర్ మీద తొడగొడుతాం, మెడ కోసుకుంటామని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తొడగొడితేనో, మెడ కోసుకుంటేనో సీఎం కేసీఆర్ మీద గెలవడం అయ్యే పనికాదని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ మీద గెలవాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తేనే అది సాధ్యమవుతుంది తప్పా ఉట్టిగా అయ్యే పనికాదని స్పష్టం చేశారు.

బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినా కూడా ఒక్క చెరువును మరమ్మత్తు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిజాం సాగర్ కాలువల ఆధునీకరణకు కృషి చేశారని, ఎన్నో చెరువులను బాగు చేసుకున్నామని, చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు పచ్చేలా పని చేసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ సు భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు బోధన్ ను బహుమానంగా ఇద్దామని పిలుపునిచ్చారు.