Train Derailed : పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేటుకు కొద్ది దూరంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలు కర్ణాటకలోని బళ్లారి నుంచి యూపీలోని గజియాబాద్కు ఐరన్ రోల్స్తో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్, పెద్దపల్లి రైల్వే స్టేషన్లను దాటిన తర్వాత రాఘవాపూర్ వద్ద ఈ రైలులోని 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. దీంతో భారీ శబ్దాలు వచ్చాయి. వాటిని విని సమీప గ్రామాల ప్రజలు రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. 44 బోగీలతో వెళ్తున్న ఈ గూడ్స్ ఓవర్ లోడ్తోనే పట్టాలు తప్పిందని అధికారులు భావిస్తున్నారు.
ఈ కారణం వల్లే ప్రమాదం..
ఓవర్ లోడ్ వల్ల రైలు బోగీల మధ్యనున్న లింకులు తెగిపోయి.. అవి పట్టాలు తప్పి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ గూడ్స్ రైలు బోగీలు ఒకదానిపై మరొకటి పడటంతో.. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న మూడు రైల్వే ట్రాక్లు చాలా దెబ్బతిన్నాయి.దీంతో ఆయా రూట్లలో వెళ్లాల్సిన 31 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. పదికిపైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. దీంతో కాజీపేట-బల్లార్షా(Train Derailed), చెన్నై- ఢిల్లీ, సికింద్రాబాద్- ఢిల్లీ రూట్లలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్లను ఆయా స్టేషన్ల వద్ద నిలిపివేశారు. బోల్తా పడిన బోగీలను తొలగించి రైళ్ల రాకపోకలను ప్రారంభించేందుకు మరో 20 గంటల టైం పడుతుందని అంచనా వేస్తున్నారు.
Also Read :Car Accident : జనంపైకి దూసుకెళ్లిన కారు.. 35 మంది మృతి.. 43 మందికి గాయాలు
రద్దయిన రైళ్లు ఇవీ..
నర్సాపూర్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – నాగ్పూర్, హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్నగర్, సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్నగర్, కాజీపేట – సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్ – కరీంనగర్, కరీంనగర్ -బోధన్, సిర్పూర్ టౌన్ – భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్ – బల్లార్షా, బల్లార్ష – కాజీపేట, యశ్వంత్ పూర్ – ముజఫర్ పూర్, కాచిగూడ – నాగర్ సోల్, కాచిగూడ – కరీంనగర్, సికింద్రాబాద్ – రామేశ్వరం, సికింద్రాబాద్ – తిరుపతి, ఆదిలాబాద్ – పర్లి, అకొలా – పూర్ణ, ఆదిలాబాద్ – నాందేడ్, నిజామాబాద్ – కాచిగూడ, రాయచూర్ – కాచిగూడ, గుంతకల్ – బోధన్ రైళ్లను రద్దు చేశారు.