తమిళనాడులో అవినీతిని సమూలంగా నిర్మూలించే దిశగా నూతన ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగే అధికారుల వివరాలను వీడియో ఆధారాలతో పట్టిస్తే, ఫిర్యాదు చేసిన వారికి ఏకంగా లక్ష రూపాయల రివార్డ్ అందిస్తామని ప్రకటించారు. ఈ పథకం రాష్ట్రంలో అవినీతిపై పోరాటంలో ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
ప్రభుత్వ అధికారి కనీసం వెయ్యి రూపాయల లంచం డిమాండ్ చేసినా సరే, బాధితులు ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధితులు చేయాల్సిందల్లా లంచం అడుగుతున్న అధికారి వీడియోను రహస్యంగా చిత్రీకరించి, దానిని ఆధారంగా చూపిస్తూ అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) రిపోర్ట్ చేయడమే. ఫిర్యాదులో నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాత సమాచారం అందించిన వారికి లక్ష రూపాయల బహుమతిని అందజేస్తారు.
అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ తమిళనాడులో ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అవినీతిపై యుద్ధం ప్రకటించిన ఆయన, రాష్ట్ర ఏసీబీని పూర్తిగా ప్రక్షాళన చేసి, దానికి పూర్తి అధికారాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
విజయ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ పథకం గనుక పకడ్బందీగా అమలైతే, రాష్ట్ర పరిపాలనలో ఇది విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అవినీతి రహిత పాలన కోసం ఎదురుచూస్తున్న ప్రజల నుంచి ఈ నిర్ణయానికి భారీ మద్దతు లభించే అవకాశం ఉంది.
