వేసవి వచ్చిందంటే చాలు బీర్లకు డిమాండ్ పెరుగుతుంది. మండుటెండల్లో చల్లచల్లని బీర్ తాగేందుకు చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా యువత ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇటీవల కాలంలో ఆల్కహాల్ ధరలు బాగా పెరగడంతో చాలామంది బీర్లకు దూరమయ్యారు. ఇలాంటివారికి తాజాగా గుడ్ న్యూస్ అందింది. ఒక్కో బీర్ పై ఏకంగా రూ.20 నుండి రూ.75 వరకు తగ్గింది. సరిగ్గా వేసవి ఎండలు ముదిరిన వేళ ఇలా ధరలు తగ్గించడంతో మందుబాబులకు ఆనందానికి అవధులు లేవు.
ఈ ధరల తగ్గింపు కేవలం కర్ణాటకలోని మందుబాబులకే కాదు.. మన తెలుగు రాష్ట్రాలలో ఉండే వారికి కూడా ఫుల్ జోష్ ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల ప్రజలకు ఇప్పుడు కర్ణాటక వైన్షాపులు చాలా దగ్గరగా ఉన్నాయి. మన దగ్గర బీర్ల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, పక్కనే ఉన్న కర్ణాటకలో ఇంత తక్కువ ధరకే లభిస్తుండటంతో వీకెండ్స్ వస్తే చాలు బోర్డర్ దాటి చిల్ అవ్వడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ ఎండలకి తోడు ధరల మంటతో అల్లాడిపోయాం. కానీ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా మాలాంటి వారికి ఒక చల్లని వరం అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, ఈ వేసవి తాపానికి కర్ణాటక సర్కార్ ఇచ్చిన బీర్ ఆఫర్ మద్యం ప్రియుల జేబులకు భారీ ఉపశమనాన్ని ఇస్తూ, సరిహద్దుల్లో కొత్త హుషారును తీసుకొచ్చింది.
