తమిళనాడు సీఎంగా సి. జోసెఫ్ విజయ్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. రోజుల తరబడి సాగిన చర్చల అనంతరం ఆయన నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఆయన ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ప్రమాణ స్వీకార వేడుకలో గీతాల ఆలాపన క్రమంపై తీవ్ర దుమారం రేగింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమం ‘వందేమాతరం’ గీతంతో ప్రారంభమైంది. ఆ తర్వాత జాతీయ గీతం ‘జనగణమన’, చివరగా తమిళనాడు రాష్ట్ర గీతమైన ‘తమిళ తాయ్ వాళ్తు’ను ఆలపించారు. సాధారణంగా తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘తమిళ తాయ్ వాళ్తు’ను మొదట, జాతీయ గీతాన్ని చివరగా పాడటం సంప్రదాయం. కానీ, ఈ సంప్రదాయానికి భిన్నంగా రాష్ట్ర గీతాన్ని మూడో స్థానానికి నెట్టడంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ ఘటనను డీఎంకే తీవ్రంగా పరిగణించింది. ఇది తమిళ సంస్కృతిని, సంప్రదాయాలను అవమానించడమేనని ఆరోపించింది. సీఎం విజయ్, ఆయన పార్టీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని డీఎంకే నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రిగా తొలి అడుగులోనే విజయ్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
ఈ వివాదంపై విజయ్ పార్టీ టీవీకే స్పందించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్ భవన్లో జరిగిందని, అక్కడి కార్యక్రమమంతా గవర్నర్ కార్యాలయం నిర్ణయం మేరకే జరిగిందని వివరణ ఇచ్చింది. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జనవరిలో జారీ చేసిన ఆదేశాల ప్రకారమే ఈ క్రమాన్ని పాటించినట్లు పేర్కొంది. అయినప్పటికీ, డీఎంకే ఈ వివరణతో సంతృప్తి చెందలేదు. కేవలం డీఎంకేనే కాకుండా విజయ్ మిత్రపక్షాలైన సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే కూడా ఈ ఘటనపై వివరణ కోరాయి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదని సూచించాయి. ఈ పరిణామాలతో విజయ్ రాజకీయ ప్రస్థానం తొలిరోజే వివాదాలతో ప్రారంభమైనట్లయింది.
