Parliament Attack : ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్పై పేట్రేగిపోయాడు. డిసెంబరు 13కు ముందే పార్లమెంటు భవనంపై దాడి చేస్తామని హెచ్చరించాడు. 2001లో పార్లమెంటుపై దాడి జరిగిన రోజైన డిసెంబర్ 13న లేదా అంతకన్నాముందే ఖలిస్తానీ ఉగ్రవాదులతో పార్లమెంటుపై దాడి చేయిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు గురుపత్వంత్ ఒక వార్నింగ్ వీడియోను రిలీజ్ చేశాడు. గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత నిఘా సంస్థలు పథక రచన చేశాయని అమెరికా మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. ఈనేపథ్యంలో అమెరికాలోనే దాక్కున్న టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ.. భారత్ టార్గెట్గా పిచ్చి కూతలు కూశాడు.
We’re now on WhatsApp. Click to Join.
భారత పార్లమెంటుపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ విడుదల చేసిన వీడియోలో.. అతడి వెనుక అఫ్జల్ గురు ఫొటో కనిపించింది. 2001లో భారత పార్లమెంట్పై దాడికి సూత్రధారి అఫ్జల్ గురు. ఈ ఫొటోతో పాటు ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్’ (ఢిల్లీని ఖలిస్థాన్గా మారుస్తాం) అనే నినాదం ఉన్న పోస్టర్ను కూడా పన్నూ డిస్ప్లే చేశాడు. తనను హత్య చేయడానికి భారత గూఢచార సంస్థలు చేసిన కుట్రలు ఫెయిలయ్యాయని ఆ పోస్టర్లో పేర్కొన్నాడు. తనపై కుట్రలకు సమాధానంగా డిసెంబర్ 13కు ముందు పార్లమెంట్పై దాడి చేయిస్తానన్నాడు. ఉగ్రవాది గురుపత్వంత్ బెదిరింపు వీడియోతో కేంద్ర నిఘా సంస్థలు(Parliament Attack) అలర్ట్ అయ్యాయి.