Kejriwal Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలన పరిణామం ఇది.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. గురువారం సాయంత్రం నుంచి సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న 12 మంది ఈడీ అధికారుల టీమ్ సోదాలు నిర్వహించింది. లిక్కర్ కేసుతో ముడిపడిన అంశాలపై ఆయనకు ప్రశ్నలు సంధించింది. దాదాపు రెండున్నర గంటల సోదాల తర్వాత కేజ్రీవాల్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత శుక్రవారం సాయంత్రమే ఈడీ అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లింది. కవిత అరెస్టు జరిగిన సరిగ్గా వారంలోనే కేజ్రీవాల్ను కూడా ఈడీ అదుపులోకి తీసుకోవడం(Kejriwal Arrest) గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join
లిక్కర్ స్కాం కేసులో తాను ఈడీ విచారణకు సహకరించేందుకు సిద్ధమని, అయితే అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్కు ఢిల్లీ హైకోర్టు గురువారం ఉదయం నో చెప్పింది. కేసు ప్రస్తుతమున్న దశలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల్లోనే సెర్చ్ వారెంట్తో ఈడీ బృందం కేజ్రీవాల్ నివాసానికి చేరుకొని.. అరెస్టు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు. దీన్ని అర్జెంట్ పిటిషన్గా పరిగణించి విచారణ చేపట్టాలని ఆయన కోరనున్నారు. లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు గతేడాది అక్టోబరు నుంచి తొమ్మిదిసార్లు కేజ్రీవాల్కు నోటీసులు జారీచేశారు. కానీ ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు.
ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయి జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో మద్యం తయారీదారులు, హోల్సేల్ వ్యాపారులు, రిటైల్ దుకాణాలకు మేలు జరిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణ ఉంది. కొందరికి అక్రమ ప్రయోజనం చేకూర్చేందుకు కేజ్రీవాల్ సర్కారులోని పెద్దలు రూ. 100 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని ఈడీ అంటోంది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల కీలక పాత్ర ఉందని ఆరోపిస్తోంది.