Supreme Court: సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో 8వ తరగతి ఎన్సీఈఆర్టీ (NCERT) పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థకు సంబంధించి ఉన్న వివాదాస్పద అంశాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వర్గాల సమాచారం ప్రకారం.. న్యాయవ్యవస్థలో అవినీతికి సంబంధించిన వివాదాస్పద కంటెంట్పై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా పరిగణిస్తోందని, దీనికి బాధ్యులైన వ్యక్తులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ వివాదాస్పద భాగాలను త్వరలోనే తొలగించే అవకాశం ఉంది.
ఎన్సీఈఆర్టీ వర్గాలు ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం.. ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని కలిగి ఉన్న 8వ తరగతి సామాజిక శాస్త్ర కొత్త పాఠ్యపుస్తకాన్ని అమ్మకాల నుంచి నిలిపివేశారు. ఫిబ్రవరి 25, బుధవారం నాడు ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల్లో 8వ తరగతి విద్యార్థులకు ‘భారత న్యాయవ్యవస్థలో అవినీతి’ గురించి బోధించడంపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించడం గమనార్హం.
‘పీటీఐ’ (PTI)తో మాట్లాడిన సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ ఇలా వ్యాఖ్యానించారు. ఈ పాఠ్యాంశం విషయంలో ఎన్సీఈఆర్టీ ఇలాంటి అంశాలను పాఠ్యపుస్తకంలో చేర్చడం దిగ్భ్రాంతికరం. పాఠ్యపుస్తకాలు పిల్లలకు మన సమాజం గురించి అవగాహన కల్పించేవిగా ఉండాలి. వారు నిజంగా విద్యావంతులను చేయాలనుకుంటే, సుమారు 40 శాతం మంది రాజకీయ నాయకులకు నేర చరిత్ర ఉందన్న వాస్తవంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
ఆయన ఇంకా ఇలా అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఈ దేశాన్ని పాలించే వారే చట్టాన్ని ఉల్లంఘించేవారు అవుతారని, వారే చివరికి శాసనకర్తలుగా మారుతారని మనం ఖచ్చితంగా ఊహించలేదు. కానీ న్యాయవ్యవస్థలో అవినీతి గురించి మాట్లాడటం సంస్థను బలహీనపరుస్తుందని నేను భావిస్తున్నాను. అవినీతి ప్రతిచోటా ఉంది. కానీ కార్యనిర్వాహక వ్యవస్థ లేదా రాజకీయాలతో పోలిస్తే న్యాయవ్యవస్థలో అవినీతి చాలా తక్కువ అని నేను మీకు హామీ ఇవ్వగలను. కాబట్టి ఈ అధ్యాయాన్ని చేర్చడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. దీనిని చేర్చాలని నిర్ణయించిన ఎన్సీఈఆర్టీ అధికారులపై జస్టిస్ సూర్యకాంత్ కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కోర్టు ధిక్కరణ కింద వారిని ఎందుకు బాధ్యులను చేయకూడదో వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని నేను భావిస్తున్నాను అని అన్నారు.
