పశ్చిమాసియా పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవడంతో దేశంలో సహజవాయువు సరఫరాపై అమలులో ఉన్న అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. హర్మూజ్ జలసంధి మార్గంలో ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్జీ) రవాణా మళ్లీ సజావుగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి అనుగుణంగా ‘నేచురల్ గ్యాస్ (సరఫరా నియంత్రణ) ఆర్డర్–2026’లో అవసరమైన సవరణలు చేసినట్లు తెలిపింది. కొద్ది నెలల క్రితం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హర్మూజ్ జలసంధి మీదుగా ఎల్ఎన్జీ నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామంతో అంతర్జాతీయ సరఫరా సంస్థలు ‘ఫోర్స్ మేజర్’ ప్రకటించగా, దేశంలో గ్యాస్ అందుబాటుపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 9న అత్యవసర నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
ఆ సమయంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువుతో పాటు దిగుమతి చేసుకున్న ఎల్ఎన్జీని అత్యవసర సేవలకు ప్రాధాన్యమిస్తూ కేటాయించింది. గృహ వినియోగానికి పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), ఎల్పీజీ ఉత్పత్తి, ఎరువుల తయారీ వంటి కీలక రంగాలకు సరఫరా కొనసాగించగా, పెట్రోకెమికల్స్, విద్యుత్ ఉత్పత్తి వంటి ప్రాధాన్యత తక్కువగా ఉన్న రంగాలకు గ్యాస్ సరఫరాలో పరిమితులు విధించింది. ఇటీవలి కాలంలో పశ్చిమాసియాలో కాల్పుల విరమణ అమలులోకి రావడం, శాంతి చర్చలు పురోగమించడం వల్ల సముద్ర రవాణా పరిస్థితులు మెరుగుపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ద్వారా ఎల్ఎన్జీ నౌకల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకోవడంతో దేశంలో సరఫరా వ్యవస్థపై ఉన్న ఒత్తిడి గణనీయంగా తగ్గిందని వివరించింది.
ఈ నేపథ్యంలో అత్యవసర ఆంక్షలు కొనసాగించాల్సిన అవసరం లేకపోవడంతో వాటిని అధికారికంగా ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సంక్షోభ పరిస్థితుల్లో అమలు చేసిన మూడు ప్రధాన అత్యవసర చర్యల్లో ఇది చివరిదని అధికారులు తెలిపారు. ఇప్పటికే రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలన్న ఆదేశాలను, బల్క్ డీజిల్ విక్రయాలపై విధించిన పరిమితులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. తాజా నిర్ణయంతో పరిశ్రమలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, వాణిజ్య వినియోగదారులకు ఊరట లభించనుంది. ఇకపై సహజవాయువు కేటాయింపులు సాధారణ వాణిజ్య ఒప్పందాలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొనసాగనున్నాయి. దీంతో పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని, ఇంధన సరఫరా వ్యవస్థలో స్థిరత్వం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
