ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక అడుగు వేస్తున్నారు. బీహార్లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు. దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా పేరొందిన బంకిపుర్ నియోజకవర్గం నుంచే ప్రశాంత్ కిశోర్ బరిలోకి దిగడం రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది. బంకిపుర్ ఉపఎన్నిక అనివార్యమవడానికి కారణం, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి నితిన్ నబిన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడమే.
ఈ స్థానంలో బీజేపీ ఎన్నో ఏళ్లుగా వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. అలాంటి బలమైన నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రజల మద్దతు ఎంత ఉందో నిరూపించాలని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన అభ్యర్థిత్వంపై స్పందించిన ప్రశాంత్ కిశోర్, జన్ సురాజ్ పార్టీ పూర్తి శక్తిసామర్థ్యాలతో ఈ ఎన్నికలో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీహార్లో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావాలన్న లక్ష్యంతో తాను గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నానని తెలిపారు. “జన్ సురాజ్ నా జీవితంలో ఒక ఉద్యమంగా మారింది. బీహార్లో మార్పు తీసుకురావడమే నా ప్రధాన లక్ష్యం. బంకిపుర్ ఉపఎన్నికలో పోటీ చేయడం ఆ లక్ష్యం వైపు మరో కీలక అడుగు” అని ఆయన పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఉపఎన్నికలో ప్రశాంత్ కిశోర్కు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కూడా జన్ సురాజ్కు మద్దతు ఇస్తుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష ఓట్లు ఏకమైతే పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బంకిపుర్ ఉపఎన్నికకు జూలై 30న పోలింగ్ జరగనుండగా, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా అనేక పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్, ఇప్పుడు స్వయంగా ప్రజా తీర్పును ఎదుర్కోనుండటం ఈ ఉపఎన్నికకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆయన రాజకీయ అరంగేట్రం బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందా, లేక బీజేపీ తన కంచుకోటను మరోసారి నిలబెట్టుకుంటుందా అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
