Tata Group: చక్రం తిప్పుతున్న టాటాలు..!

ఇప్పటికే మలేసియా ఎయిర్‌లైన్స్ వాటాలున్న ఎయిర్ ఏషియా  ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్ మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ పెట్టుబడులు ఉన్న విస్తారా టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం కానున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి.

ఇప్పటికే మలేసియా ఎయిర్‌లైన్స్ వాటాలున్న ఎయిర్ ఏషియా  ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్ మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ పెట్టుబడులు ఉన్న విస్తారా టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం కానున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి. ఈ విలీన ప్రక్రియ 2024 మార్చి కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎప్పటినుంచో విలీనం గురించి ఈ రెండింటి మధ్య చర్చలు జరుగుతున్నాయి. విస్తారా, ఎయిర్ ఇండియా విలీనంకు సంబంధించి సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ (SIA) కూడా మంగళవారం ప్రకటన చేసింది. విస్తారాను ఎయిర్ ఇండియాలో విలీనం చేసిన తర్వాత ఎయిర్ ఇండియాలో తమకు 25% వాటా ఉండనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం విస్తారాలో టాటా గ్రూప్‌కు 51% వాటా ఉండగా మిగతా 49% సింగపూర్ ఎయిర్‌ లైన్స్ లిమిటెడ్‌ ది.

ముందు జరిగిన ఒప్పందం ప్రకారం ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ రూ.2058.5 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. విస్తారా  ఎయిర్ ఇండియాలో విలీనం పూర్తయిన తర్వాత సింగపూర్ ఎయిర్‌ లైన్స్ లిమిటెడ్‌కు ఎయిర్ ఇండియాలో 25.1% వాటా కలిగి ఉండనున్నట్లు ప్రెస్ రిలీజ్‌లో పేర్కొంది. ఈ విలీన ప్రకటన తర్వాత టాటా గ్రూప్ కూడా ప్రెస్ రిలీజ్ చేసింది. విలీనం పూర్తయితే ఎయిర్ ఇండియా 218 విమానాలతో భారత అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా అవతరిస్తుందని తెలిపింది. ఇక దేశీయంగా చూస్తే రెండో స్థానంలో ఉండనున్నట్లు వివరించింది. టాటా గ్రూప్ ₹.18 వేల కోట్లతో భారత ప్రభుత్వం నుంచి ఈ ఏడాది ప్రారంభంలో ఎయిర్ ఇండియాను తిరిగి దక్కించుకున్న విషయం తెలిసిందే.

సింగపూర్ ఎయిర్‌ లైన్స్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా కలిసి విస్తారాను ప్రారంభించాయి. ప్రస్తుతం 43 జాతీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతోంది. రోజుకు సగటున 260 కంటే ఎక్కువ విమాన సర్వీసులు నడుపుతున్నట్లు సమాచారం. మొత్తంగా ఇందులో 4700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక మరో విశేషం ఏంటంటే టాటా గ్రూప్‌కు ప్రస్తుతం నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా ఎయిర్‌‌లైన్స్ టాటాలవే. ఇవన్నింటినీ కూడా ఒకే గూటికి తీసుకొచ్చే ప్రణాళికలు రచిస్తోంది టాటా సన్స్. ఇప్పటికే ఎయిర్ ఏషియా ఇండియాలో మలేసియా ఎయిర్‌లైన్స్‌కు కొంత వాటాలుండగా దీనిని పూర్తిగా టాటా గ్రూప్ కొనుగోలు చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో ఎయిర్ ఏషియా ఇండియా నుంచి మలేసియా ఎయిర్‌లైన్స్ పూర్తిగా వైదొలిగినట్లే. దీంతో ఇది కూడా పూర్తి భారత విమానయాన సంస్థగా అవతరించనుంది.