Dream About Shri Ram : వివాదాస్పద కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడారు. ‘‘రాముడు నా కలలోకి వచ్చి.. మార్కెట్లో తనను విక్రయించకుండా చూడమని చెప్పారు’’ అంటూ వివాదం క్రియేట్ చేసే వ్యాఖ్యలను ఆయన చేశారు. తాజాగా బిహార్లోని రాంపూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చంద్రశేఖర్ ఈ కామెంట్స్ చేశారు. ‘రామచరితమానస్’పై, కుల వ్యవస్థపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కొందరి నుంచి బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నారు. వాటిపై తన అభిప్రాయం జీవితాంతం ఒకే విధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇటీవల హిందీ దివస్ కార్యక్రమం సందర్భంగా పవిత్ర రామచరితమానస్ గ్రంథాన్ని ఆయన విషపదార్థమైన ‘సైనైడ్’తో పోల్చడం వివాదానికి దారితీసింది. ‘‘మీకు 50 రకాల వంటకాలను వడ్డించి అందులో పొటాషియ సైనైడ్ ను కలిపితే తింటారా ? హిందూ మత గ్రంథాలది కూడా ఇదే పరిస్థితి. రామచరితమానస్ మన ధార్మిక గ్రంథాల్లో సైనైడ్ లా కలిసిపోయింది. అది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, హిందీ రచయిత నాగార్జున, సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రామచరిత మానస్ సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోంది. ప్రేమ, ఆప్యాయతతోనే దేశం గొప్పది అవుతుంది’’ అని ఆ ప్రోగ్రామ్ లో చంద్రశేఖర్ చెప్పారు. ‘‘రాముడు సైతం శబరి ఎంగిలి చేసిన ఆహారాన్ని తిన్నాడు. నేటికీ శబరి కుమారుడికి ఆలయ ప్రవేశం నిషిద్ధమే. ఇది విచారకరం’’ అని గతంలో చంద్రశేఖర్ కామెంట్ చేశారు.