PK Vs Nitish : బిహార్ పాలిటిక్స్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ అయ్యారు. ఆయనకు చెందిన జన్ సూరజ్ పార్టీ ముమ్మర కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకం అవుతోంది. వచ్చే ఏడాది అక్టోబరులో బిహార్లో జరిగే అసెంబ్లీ పోల్స్ను పీకే చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే తాజాగా బిహార్లోని భాగల్పూర్లో జరిగిన జన్ సూరజ్ పార్టీ బహిరంగ సభలో ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్పై పీకే ఫైర్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘నితీశ్ కుమార్ అధికార దాహంతో.. కేంద్ర మంత్రి పదవుల కోసం ప్రధాని మోడీ పాదాలకు నమస్కరించారు. ఇలా చేయడం ద్వారా ఆయన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టారు. సీఎం హోదాలో ఉండి.. బిహార్ పరువు తీసేలా నితీశ్ ప్రవర్తించారు’’ అని జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. ‘‘గతంలో నేను జేడీయూ పార్టీలో కీలక పదవిలో పనిచేశాను. నితీశ్ కుమార్తో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. అయినా ఇప్పుడు నేను ఆయన్ని విమర్శించాల్సి వస్తోంది. ఇలా ఎందుకు చేస్తున్నారని చాలామంది నన్ను అడుగుతున్నారు. అలాంటి వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. అప్పట్లో నితీశ్ వేరే వ్యక్తి. ఆనాడు ఆయన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదు’’ అని పీకే కామెంట్ చేశారు. ‘‘నితీశ్ కుమార్ ఇప్పుడు తన సిద్దాంతాలతో రాజీ పడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల గురించే ఆయన ఆలోచిస్తున్నారు’’ అని ప్రశాంత్ కిశోర్(PK Vs Nitish) తెలిపారు.
‘‘ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు ఆ రాష్ట్రంలోని ప్రజలకు గర్వకారణంగా ఉండాలి. ఇతరుల పాదాలను తాకాల్సిన అవసరం లేదు. మోడీ పాదాలను తాకడం ద్వారా యావత్ బిహార్ రాష్ట్రాన్ని నితీశ్ అవమానించారు’’ అని పీకే చెప్పారు. ‘‘కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం నితీశ్ కీలక పాత్రలో ఉన్నా.. బిహార్ కోసం ఏమీ చేయలేకపోతున్నారు. ఆయన తల్చుకుంటే చాలా చేయొచ్చు’’ అని ప్రశాంత్ కిశోర్ విమర్శించారు. కాగా, ఎన్డీయే కూటమి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ పాదాలను బిహార్ సీఎం నితీశ్ కుమార్ తాకి నమస్కరించారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ పై కామెంట్స్ చేశారు.