తీవ్ర ఆర్థిక సంక్షోభంతో (Crisis) అల్లాడిపోతున్న పాకిస్థాన్.. భారత్ కరుణ కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కలేక, పాక్ పౌరుల (Pakistan) ఆకలి తీర్చలేక నానా తిప్పలు పడుతున్న పాకిస్థాన్ ప్రధాని (Pak Pm) షెహబాజ్ షరీఫ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్ తనేంటో తెలుసుకుందని, గుణపాఠం నేర్చుకుందని, భారత్తో శాంతిని కోరుకుంటున్నామని, శాంతికాముక దేశంతో కలిసి పనిచేయాలని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. కశ్మీర్ సహా ఇతర కీలక సమస్యలపై నిజాయితీగా చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మాట్లాడాలని భావిస్తున్నామన్నారు. ఈ మేరకు దుబాయ్కు చెందిన ఓ న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత నాయకత్వానికి (India Leadership), ముఖ్యంగా ప్రధాని మోదీకి (PM Modi) తాను చెప్పేది ఒక్కటేనని పేర్కొన్నారు. కూర్చుని చర్చించుకుందామని, సీరియస్గా, సిన్సియర్గా మాట్లాడుకుందామని, కశ్మీర్ సహా అన్ని అంశాలను పరిష్కరించుకుందామని పాక్ ప్రధాని అన్నారు. అంతేకాదు, భారత్తో (India) ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధం చేశామన్న షరీఫ్ వాటి వల్ల పాకిస్థాన్ చాలా నష్టపోయిందన్నారు. కష్టాలు, పేదరికం, నిరుద్యోగం మాత్రమే మిగిలాయని.. వాటి నుంచి పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని చెప్పారు.
భారత్తో కలిసి శాంతియుత (Peace) పంథాలో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. ఇరు దేశాలు పరస్పరం శాంతియుతంగా, అభివృద్ధిపరంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నామన్నారు. కశ్మీర్ అంశంపై మాట్లాడుతూ.. కశ్మీర్లో జరిగిందేదో జరిగిపోయిందన్న షరీఫ్ ఇక, అన్నీ ఆపేద్దామని పేర్కొన్నారు. పాకిస్థాన్ (Pakistan) శాంతిని కోరుకుంటోందని చెప్పారు. బాంబులు, మందుగుండు సామగ్రిపై వృథా అవుతున్న వనరులను ఆపాలని తాము భావిస్తున్నామన్నారు.