POK Floods : పాకిస్తాన్ వక్రబుద్ధి మారడం లేదు. భారత్ను తప్పుడు కోణంలో చూసే పనిని పాక్ ఆపడం లేదు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)ను వరదలు ముంచెత్తుతున్నాయి. చివరకు ఈ వరదలను కూడా భారత్తో ముడిపెట్టి పాకిస్తాన్ చూస్తోంది.
Also Read :ED Office Fire: ఈడీ ఆఫీసు భవనంలో భారీ అగ్నిప్రమాదం
అకస్మాత్తుగా జీలం నీటిని వదిలిందని..
ఓ వైపు భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీరులో జీలం నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో పీఓకేలోని ముజఫరాబాద్కు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. జీలం నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు అలర్ట్గా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. పీఓకేలోని హట్టియన్ బాలా, ఘరి దుపట్టా, మఝోయ్ వంటి ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పౌరులంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. జీలం నది నీటిమట్టం పెరగడంతో చకోఠి సరిహద్దు నుంచి ముజఫరాబాద్ వరకు నదీతీరంలో వరదల ముప్పుపెరిగింది. దీంతో అక్కడి ప్రజలను ఆందోళన చుట్టుముట్టింది. భారత్ ఉద్దేశపూర్వకంగానే అకస్మాత్తుగా జీలం నది నీటిని పీఓకేలోకి వదిలిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.
ఇరుదేశాల మధ్య కమ్యూనికేషన్ లేక..
భారత్లోని అనంతనాగ్ నుంచి చకోఠీ ప్రాంతం మీదుగా నీరు పీఓకేలోకి(POK Floods) ప్రవేశిస్తున్నట్టు చెబుతోంది. ప్రస్తుతం పీఓకేలోని నదీ తీర ప్రాంతాల్లో 20 నుంచి 30 అడుగుల ఎత్తున జీలం నది నీళ్లు ప్రవహిస్తున్నాయని సమాచారం. 1990 దశకం తర్వాత పీఓకేలో ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. సింధూ నదీ ఒప్పందాన్ని నిలిపివేస్తామని భారత్ నిర్ణయించిన తర్వాత పీఓకేను వరదలు చుట్టుముట్టడం గమనార్హం. పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలపై భారత అధికారులు ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. దీంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రతీ విషయంలో ఇరుదేశాలు అనుమాన భావంతో ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.