Nirmala Sitharaman : దేశాలు దీర్ఘకాలం పాటు స్థిరమైన వృద్ధిని సాధించాలంటే మౌలిక సదుపాయాలు (ఇన్ ఫ్రా), పెట్టుబడులు (ఇన్వెస్ట్ మెంట్), ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), కలుపుగోలుతనం (ఇన్ క్లూజివిటీ) అనే నాలుగు “ఐ”లపై దృష్టిపెట్టాలని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక ఇబ్బందులను ఎదుర్కొందని పేర్కొన్నారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) బోర్డ్ ఆఫ్ గవర్నర్ల సమావేశంలో గురువారం ఆమె ప్రసంగించారు. ఏడీబీ 56వ వార్షిక సమావేశం థీమ్ “రీబౌండింగ్ ఆసియా: రికవర్, రీకనెక్ట్, రిఫార్మ్” అనేది.. భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ తీసుకున్న “వన్ ఎర్త్” థీమ్ స్ఫూర్తిని ప్రతిధ్వనించేలా ఉందన్నారు.
నాలుగు “ఐ”ల గురించి నిర్మలా సీతారామన్ వివరిస్తూ.. ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉన్న మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు తప్పనిసరి అన్నారు.ఆవిష్కరణల కోసం, దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కోవడానికి స్టార్టప్ల నుంచి వినూత్న పరిష్కారాలను జోడించడం అవసరమని తెలిపారు. పెట్టుబడులు, ఆవిష్కరణలను పెంచడానికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యం అవసరమని స్పష్టం చేశారు. ప్రపంచం విడిపోలేదు.. అందుకే ఎక్కడైనా ఏదైనా జరిగినా అది ప్రతి దేశంపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
జీ 20 ప్రెసిడెన్సీ చేపట్టాక భారతదేశం ప్రతి దేశంతో మాట్లాడటానికి ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను అందించడానికి అన్ని దేశాలు కలిసి రావాలన్నారు. అంతకుముందు ఏడీబీ అధ్యక్షుడు మసత్సుగు అసకవాతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. కాగా, 1966లో స్థాపించబడిన ఏడీబీలో భారత్ నాలుగో అతిపెద్ద వాటాదారు.
Also Read: Murder Case : రైల్వే ప్లాట్ఫారమ్పై యువకుడి హత్య కేసులో ఐదుగురు అరెస్ట్