ఢిల్లీలోని పహర్గంజ్ ప్రాంతంలో శనివారం ఓ వివాహ వేడుకకు వెళ్లి తన స్నేహితుడితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధానికి పాల్పడ్డారనే కారణంతో అతడిని కత్తితో ముగ్గురు వ్యక్తులు పొడిచి చంపారు. మృతుడు జతిన్గా పోలీసులు గుర్తించారు. జతిన్ని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీకి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. సౌరభ్ అనే వ్యక్తి తన ఇద్దరు సహచరులతో కలిసి జతిన్ను హత్య చేశాడు. కన్నాట్ ప్లేస్లోని పాలికా బజార్లోని టాటూ షాపులో పనిచేసిన సౌరభ్ను పోలీసులు అరెస్టు చేయగా.. అతని సహచరులు ఇంకా పరారీలో ఉన్నారు.
నబీ కరీం పోలీస్ స్టేషన్లో IPC సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదైంది. ముల్తానీ దండా నివాసి సౌరభ్ (23)ని అరెస్టు చేశారు. తన భార్యకు దూరంగా ఉండాలని జతిన్ను హెచ్చరించినట్లు సౌరభ్ పోలీసులకు తెలిపాడు. తన భార్య తనను విడిచిపెట్టి జతిన్తో కలిసి జీవించాలని యోచిస్తున్నట్లు తెలిసిందని. అందుకే తాను ఈ నేరానికి పాల్పడినట్లు తెలిపాడు. సౌరభ్ గతంలో దొంగతనం, స్నాచింగ్లు, దోపిడీ వంటి నాలుగు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.