Mayawati Heir : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఏకంగా తన రాజకీయ వారసుడిపైనే వేటు వేశారు. ఇంతక్రితం మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు, బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్ పేరును ప్రకటించగా.. తాజాగా ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆకాశ్ ఆనంద్ను రాజకీయ వారసుడిగా పేర్కొంటూ గతంలో చేసిన ప్రకటనను కూడా మాయావతి వెనక్కి తీసుకున్నారు. ఆకాశ్ ఆనంద్కు పూర్తి పరిపక్వత వచ్చేవరకు ఈ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు మంగళవారం రాత్రి ట్విట్టర్ వేదికగా మాయావతి అనౌన్స్ చేశారు. బీఎస్పీ జాతీయ సమన్వయ కర్త బాధ్యతలను మునుపటిలాగే ఆకాశ్ తండ్రి, తన సోదరుడు ఆనంద్కుమార్ ఇకపై నిర్వర్తిస్తారని ఆమె స్పష్టం చేశారు. వాస్తవానికి బీఎస్పీ జాతీయ సమన్వయ కర్త పదవి ఐదు నెలల క్రితమే ఆకాశ్ ఆనంద్కు దక్కింది. ఇంతలోనే ఆయన పదవి కోల్పోవాల్సి రావడంతో రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరిగిన రోజే మాయావతి ఈ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join
‘‘బీజేపీకి వ్యతిరేకంగా ఆకాశ్ ఆనంద్ చేసిన వ్యాఖ్యల వల్ల ప్రజలకు కోపం వచ్చింది. అందుకే మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకాశ్ను బాధ్యతల నుంచి తొలగించారు’’ అని బీజేపీ నేత రాకేశ్ త్రిపాఠి పేర్కొన్నారు. ‘‘బీజేపీ నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారా ? ఈ వ్యవహారం బీఎస్పీ అంతర్గత విషయమే అయినప్పటికీ దీనిపై మాయావతి వివరణ ఇవ్వాలి’’ అని కాంగ్రెస్ నేత సురేంద్ర సింగ్ రాజ్పుత్ డిమాండ్ చేశారు.