Jamili Elections : లోక్సభ జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి ఏర్పాటైన జేపీసీ కాల పరిమితి పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ కమిటీ కాల పరిమితిని పెంచేందుకు లోక్సభ అంగీకరించింది. వర్షాకాల సమావేశాల చివరివారంలో తొలి రోజు వరకు గడువు పొడిగించింది. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ప్రతిపాదించిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
Read Also: Defected MLAs Case : ఇంకా ఎంత టైం ఇవ్వాలి.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (JPC) పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో 39 మంది ఎంపీలతో జేపీసీ కమిటీ ఈ బిల్లును అధ్యయనం చేసేందుకు ఏర్పాటైంది. దీనిలో లోక్సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉన్నారు. అయితే.. ఈ కమిటీ కాలపరిమితి వచ్చేనెల 4న ముగియనుంది. ఈ బిల్లుపై చేయాల్సిన పని ఇంకా మిగిలివుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ అంశంపై పలువురు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిగాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ రంజన్ గొగోయ్, ప్రఖ్యాత న్యాయకోవిదుడు హరీశ్ సాల్వే, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి.షాలు కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు. జేపీసీ గడవు పొడిగించే తీర్మానానికి లోక్సభ తాజాగా ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.