Autopsy Document Missing : కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై ఆగస్టు 9న జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశంలో కలకలం రేపింది. ఈ ఘటన విషయంలో పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. జూనియర్ వైద్యురాలి పోస్టుమార్టం రిపోర్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ దొరకడం లేదని బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అంత కీలకమైన డాక్యుమెంట్స్(Autopsy Document Missing) ఎలా మిస్సవుతాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బెంగాల్ సర్కారును ఈసందర్భంగా ప్రశ్నించింది.
Also Read :Firecrackers Ban In Delhi : జనవరి 1 వరకు అన్ని బాణసంచాలపై బ్యాన్.. కీలక ప్రకటన
పోస్టుమార్టం రిపోర్టులు మిస్సయిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పోస్టుమార్టం కోసం బాధితురాలి మృతదేహంతోపాటు ఆమె దుస్తులను కూడా పంపించారా అని బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పోస్ట్మార్టం కోసం డెడ్బాడీతో పాటు ఇంకా ఏమేం పంపారనేది సంబంధిత ఛాలాన్లోని కాలమ్లో కానిస్టేబుల్ రాయాల్సి ఉంటుందని కోర్టు గుర్తుచేసింది. అసలు ఆ పత్రం లేకుండా పోస్టుమార్టం చేసేందుకే వీలుండదు కదా అని బెంగాల్ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ను సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది.
Also Read :Jayam Ravi : విడాకుల లిస్ట్ లో మరో హీరో.. భార్యతో విడిపోయిన తమిళ హీరో..
‘‘ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికలో ఆ ఛాలాన్ ప్రస్తావనే లేకపోవడం దారుణం. ఒకవేళ అది మిస్ అయితే అలా ఎందుకు జరిగిందో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారుపైనే ఉంది. దీనిపై మంగళవారంలోగా వివరణ ఇవ్వండి’’ అని బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాది కపిల్ సిబల్కు సుప్రీంకోర్టు బెంచ్ నిర్దేశించింది. ఆ ఛాలాన్ను సమర్పించేందుకు కొంత సమయం ఇవ్వాలని కపిల్ సిబల్ కోరారు. ‘‘జూనియర్ వైద్యురాలు చనిపోయిన 14 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిపై తాజా నివేదికను సెప్టెంబర్ 17లోగా మాకు సమర్పించండి’’ అని సీబీఐకు సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. బాధితురాలి ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది.