కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Karnataka CM Basavaraj Bommai) షిగ్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి శనివారం (ఏప్రిల్ 15) నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మరోసారి అత్యధిక ఓట్లు సాధించి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగాల్సి ఉండగా మే 13న ఫలితాలు రానున్నాయి. బొమ్మై నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో ప్రజాపనుల శాఖ మంత్రి సిసి పాటిల్, హవేరి-గడగ్ ఎంపి శివకుమార్ ఉదాసి, ముఖ్యమంత్రి కుమారుడు భరత్ బొమ్మై తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన ఎన్నికల అఫిడవిట్లో రూ.49.70 కోట్ల ఆస్తులను ప్రకటించారు. అఫిడవిట్లో ఇచ్చిన పెట్టుబడి వివరాల ప్రకారం ముఖ్యమంత్రికి రూ.5.98 కోట్ల చరాస్తులు ఉన్నాయని, హిందూ అవిభాజ్య కుటుంబం నుంచి వచ్చిన ఆస్తులుగా రూ.1.57 కోట్లు పొందారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రిపై రూ.5.79 కోట్ల అప్పు
ఆయన భార్య చన్నమ్మ రూ.1.14 కోట్లు, కూతురు అదితి రూ.1.12 కోట్లు పెట్టుబడి పెట్టారు. అతని కుమారుడు భరత్ బొమ్మై తన తండ్రిపై ఆధారపడటం లేదు. కాబట్టి అతని పెట్టుబడి వివరాలను పేర్కొనలేదు. బసవరాజ్ బొమ్మై తన కుమారుడు భరత్ కు రూ.14.74 లక్షలు ఇచ్చినా ముఖ్యమంత్రికి రూ. 42.15 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన రూ. 19.2 కోట్లు ఉన్నాయి. బొమ్మైకి కూడా రూ.5.79 కోట్ల అప్పు కూడా ఉంది. అంతేకాకుండా సిఎం బొమ్మైకు సొంత కారు కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు.
Also Read: Atiq Ahmad: సీఎం యోగి ఇంటి వద్ద భారీగా పోలీసులు
అఫిడవిట్ ప్రకారం.. సిఎం బొమ్మై ముఖ్యమంత్రి పదవిలో ఉండగా 26 మార్చి 2022 న ధార్వాడలోని హుబ్లీ తాలూకాలోని తరిహాల గ్రామంలో సుమారు మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. బొమ్మై, అతనిపై ఆధారపడిన వారి ఆస్తుల విలువ రూ.52.12 కోట్లు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా పరివార్ నాయకుడు దివంగత ఎస్ఆర్ బొమ్మై కుమారుడు బసవరాజ్ బొమ్మై 2008 నుంచి మూడుసార్లు షిగ్గావ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ముఖ్యమంత్రి షిగ్గావ్లోని దేవి ఆలయానికి వెళ్లారు.