EC : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మరోసారి గట్టి ప్రతిస్పందన తెలిపింది. ఓటింగ్లో అసౌకర్యాలపై నిరాధార ఆరోపణలు చేస్తూ ‘ఓటు చోరీ’ అనే పదాన్ని పదేపదే వినియోగించడం సరికాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తన ప్రకటనలో పేర్కొంది. దేశంలో ‘ఒక వ్యక్తికి ఒక్క ఓటు’ అనే నియమం 1951-52లో తొలిసారి ఎన్నికలు జరిగినప్పటి నుంచే అమలులో ఉంది. ఇప్పటి వరకూ ఆ నియమం ఏమాత్రం మారలేదు. ఎవరైనా రెండుసార్లు ఓటు వేశారు అనీ, ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని అనుకుంటే, తగిన ఆధారాలతో పాటు లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించాలి. ఆధారాలు లేకుండా ఓటు చోరీ ఓటర్లను దొంగలుగా పిలవడం వంటి పదాలు వాడడం నేరుగా కోట్లాది మంది ఓటర్లను అవమానించేలా ఉంటుంది అని స్పష్టం చేసింది.
Read Also: TDP : వైసీపీకి మరో షాక్.. ఒంటిమిట్టలో టీడీపీ విజయం
రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గంలో లక్ష ఓట్లు అక్రమంగా జాబితాలో చేర్చబడ్డాయని ఆరోపించారు. ఈ నియోజకవర్గం బెంగళూరు సెంట్రల్ లోక్సభ పరిధిలోకి వస్తుంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. కానీ ఈ వ్యాఖ్యలు ఎంతవరకు నిజమన్నదానిపై ఎన్నికల సంఘం అనుమానం వ్యక్తం చేస్తూ, ఆయన ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో కూడిన అధికారిక డిక్లరేషన్ను సమర్పించాలని కోరింది. ఓటర్ల జాబితాలో తప్పిదాలుంటే, అవి రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. సాధారణంగా ఓటర్ల జాబితా సవరణకు ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తాము. ప్రజలు, రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలను వ్యవస్థపరంగా వెల్లడించాలి. కానీ అవాస్తవాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం ఆమోదయోగ్యం కాదు.
ఇదే సమయంలో ఈసీ కీలక వ్యాఖ్య చేసింది. ఓటర్లపై ఇలాంటి బరితెగిన ఆరోపణలు చేయడం లక్షల మంది ఎన్నికల సిబ్బందిపై నేరుగా దాడి చేయడమే. వారు ప్రజాస్వామ్యాన్ని నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తున్న వారు. వారి కృషిని ఇలా అవమానించటం అభాసపరిచే చర్యగా చూస్తున్నాం. కాంగ్రెస్ నేతలు మాత్రం తమ ఆరోపణలపై నిలదీస్తూ, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న అవకతవకలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఒక్కో ఆరోపణపై ఆధారాలు సమర్పించాలని స్పష్టం చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడాన్ని ఉపేక్షించబోమని హెచ్చరిస్తోంది. ఇలాంటి రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు ఎన్నికల సంఘం వ్యవస్థాపిత చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేసింది.