భారతదేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థగా పేరుగాంచిన రష్యా తయారీ S-400 ట్రయంఫ్ (సుదర్శన్) క్షిపణి వ్యవస్థలను అదనంగా కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, భారత్ తన గగనతల రక్షణను అజేయంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఐదు S-400 స్క్వాడ్రన్లలో మూడు భారత్కు చేరగా, మిగిలిన రెండు రావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న అవసరాల దృష్ట్యా మరో ఐదు అదనపు S-400 స్క్వాడ్రన్లను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ యోచిస్తోంది. దీనితో పాటు వివిధ రకాల క్షిపణులను కూడా సేకరించాలని చూస్తోంది. ఈ ప్రతిపాదనకు రక్షణ కొనుగోళ్ల మండలి (DAC) త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
S-400 వ్యవస్థను భారత్ ‘సుదర్శన్’ అని పిలుచుకుంటోంది. ఇది ఒకేసారి శత్రువులకు చెందిన విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణులను 400 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి ధ్వంసం చేయగలదు. ఒకే సమయంలో వందలాది లక్ష్యాలను ట్రాక్ చేస్తూ, అత్యంత ఖచ్చితత్వంతో వాటిని నేలకూల్చడం దీని ప్రత్యేకత. గతంలో ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించి, తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే భారత్పై గగనతల దాడులు చేయడం శత్రువులకు అసాధ్యంగా మారుతుంది.
