Heavy Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు

మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు పెను విషాదాన్ని సృష్టించాయి. పుణే జిల్లాలో సోమవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ ఘోర దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరోవైపు, ఈ విపత్తు కారణంగా ముంబై-పుణే మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై నగరానికి భారత వాతావరణ శాఖ (IMD) ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. పుణే […]

Published By: HashtagU Telugu Desk
Heavy rains in Maharashtra

Heavy rains in Maharashtra

మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు పెను విషాదాన్ని సృష్టించాయి. పుణే జిల్లాలో సోమవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ ఘోర దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరోవైపు, ఈ విపత్తు కారణంగా ముంబై-పుణే మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై నగరానికి భారత వాతావరణ శాఖ (IMD) ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే.. పుణే జిల్లాలోని మావల్ తహసీల్ పరిధిలోని పటాన్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున 4:25 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో సుమారు ఐదు ఇళ్లు శిథిలాల కింద సమాధి అయ్యాయి. ప్రమాద సమయంలో నిద్రలో ఉన్న నందు టికోనే (60), మౌళి టికోనే (30), అనితా టికోనే (55) అనే ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించారు.

సుమారు 30 నుంచి 35 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తుండగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా గ్రామంలో మూడు వేర్వేరు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని, ఒక ఘటనలో ఇల్లు కూలి ముగ్గురు మరణించారని డీఎస్పీ గజానన్ టోంపే తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) రంగంలోకి దిగింది. పుణేలోని 5వ బెటాలియన్‌కు చెందిన 30 మంది సభ్యుల ప్రత్యేక బృందం సహాయక చర్యలు చేపట్టిందని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికితీశామని, మూడో మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోందని ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు తెలిపినట్లు పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది.

స్తంభించిన రవాణా.. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన

కొండచరియలు విరిగిపడటంతో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే, పాత ముంబై-పుణే హైవేలపై వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని ప్రజలకు సూచించారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. రెండు నెలల క్రితమే ప్రారంభమైన 13 కిలోమీటర్ల ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే మిస్సింగ్ లింక్ మార్గంలో కూడా రాకపోకలు ప్రభావితమయ్యాయి.

ముంబైలో జనజీవనం అస్తవ్యస్తం.. 8 మంది మృతి

మరోవైపు, భారీ వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమవుతోంది. ముంబై, థానే, రాయ్‌గఢ్ జిల్లాలకు IMD ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు, గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.

బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కూడా హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. కాగా, ముంబైలో గత రెండు రోజులుగా వర్ష సంబంధిత ఘటనల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. చెట్లు కూలిన ఘటనల్లో ఇద్దరు, ఆదివారం మన్‌ఖుర్ద్ ప్రాంతంలో ఒక భవనం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

  Last Updated: 06 Jul 2026, 02:36 PM IST