H-1B Visa Fee Hike: హెచ్-1బి వీసా ఫీజు పెంపు.. భార‌త‌దేశానికి ప్ర‌యోజ‌న‌మా??

ఐటీ పరిశ్రమల సంస్థ నాస్కామ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ హెచ్-1బి వీసా దరఖాస్తు ఫీజును $1 లక్షకు పెంచడం భారతీయ సాంకేతిక సేవా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది.

Published By: HashtagU Telugu Desk
H-1B Visa

H-1B Visa

H-1B Visa Fee Hike: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి వీసా ఫీజును $1 లక్షకు (H-1B Visa Fee Hike) పెంచింది. ఈ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీలు, నిపుణులు, గ్లోబల్ టెక్ దిగ్గజాలపై తీవ్ర ఆర్థిక భారం మోపనుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ చర్యతో కంపెనీలు కొత్త దరఖాస్తులను తగ్గించే అవకాశం ఉంది. అయితే ఇది భారతదేశంలోని ఐటీ నగరాలకు కొత్త అవకాశాలను కూడా సృష్టించగలదు.

ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ అభిప్రాయం

కంపెనీలు అమెరికాకు చౌక శ్రమను పంపడానికి హెచ్-1బి వీసాను ఉపయోగిస్తున్నాయనే వాదనను ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) మోహన్‌దాస్ పాయ్ ఖండించారు. హెచ్-1బి వీసా ద్వారా నియమించబడిన టాప్ 20 ఉద్యోగుల సగటు జీతం ఇప్పటికే $1 లక్ష కంటే ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ‘అసంబద్ధమైనవి’ అని పాయ్ అభివర్ణించారు.

భారతదేశానికి ప్రయోజనం

నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. హెచ్-1బి వీసా ఫీజు పెంపు అమెరికాలోని ఆవిష్కరణల వ్యవస్థను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే దీనివల్ల తదుపరి పరిశోధన కేంద్రాలు, పేటెంట్లు, స్టార్టప్‌లు భారతదేశం వైపు ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల వైపు మళ్లుతాయని ఆయన అన్నారు. ప్రపంచ స్థాయి ప్రతిభకు అమెరికా తలుపులు మూసుకుపోతే, భారతీయ సాంకేతిక నగరాలకు కొత్త ఊపు వస్తుందని అన్నారు. భారత్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారగలదని ఆయన పేర్కొన్నారు.

Also Read: Birkin Bag: ఈ కంపెనీ బ్యాగ్ తాక‌ట్టు పెట్టి రుణం పొందొచ్చు.. ప్రాసెస్ ఇదే!

భారతీయ ఐటీ కంపెనీలు, గ్లోబల్ దిగ్గజాలపై ప్రభావం

జేఎస్ఏ అడ్వకేట్స్ అండ్ సాలిసిటర్స్ భాగస్వామి సజై సింగ్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం హెచ్-1బి వీసాలపై ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ కంపెనీలు, నిపుణులకు ఆర్థికంగా ఖరీదైనదని పేర్కొన్నారు. ఇది వ్యాపార నమూనాలు, ఆదాయాలపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. భారతీయ టెక్ కంపెనీలకు ప్రతి సంవత్సరం 8,000 నుంచి 12,000 కొత్త హెచ్-1బి వీసాలు లభిస్తాయి. ఈ ప్రభావం కేవలం భారతీయ కంపెనీలకే కాకుండా అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బహుళజాతి కంపెనీలపై కూడా పడుతుంది.

నాస్కామ్ ఆందోళన

ఐటీ పరిశ్రమల సంస్థ నాస్కామ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ హెచ్-1బి వీసా దరఖాస్తు ఫీజును $1 లక్షకు పెంచడం భారతీయ సాంకేతిక సేవా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ చర్య విదేశాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల వ్యాపార కొనసాగింపునకు ఆటంకం కలిగించవచ్చని నాస్కామ్ తెలిపింది. సెప్టెంబర్ 21 గడువు చాలా తక్కువగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా నిపుణులు మరియు విద్యార్థులలో అనిశ్చితి పెరిగిందని నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది.

  Last Updated: 20 Sep 2025, 06:48 PM IST