Justice Sanjiv Khanna : రోజురోజుకు దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు భారత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక సూచనలు చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్నందున వీలైతే జడ్జీలు వర్చువల్గా వాదనలు వినిపించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఇక కాలుష్య అంశం చేయి దాటిపోయిందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తక్షణ చర్యలు అవసరమని ఆయన తెలిపారు.
జీఆర్పీఏ-4 పరిమితులను పరిగణనలోకి తీసుకొని ఢిల్లీలోని కోర్టులు పూర్తిగా వర్చువల్ విధానాన్ని అనుసరించాలని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ శంకరనారాయణన్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. దీంతో ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్ మోడ్లో పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు.
మరోవైపు ఢిల్లీలో వాయుకాలుష్యం క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. మంగళవారం సగటు గాలి నాణ్యతా సూచీ (AQI) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్క్ దాటిందని వాతావరణ శాఖ అధికారులు ఈరోజు వెల్లడించారు. వాయు కాలుష్యంపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తున్నా అధికారులు అలసత్వం ప్రదర్శించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఈ వాయుకాలుష్యం కారణంగా ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Read Also: criminal case : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఊరట..క్రిమినల్ కేసు ఎత్తివేత!