నీట్ (NEET) అక్రమాలు, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హక్కుల కార్యకర్తలపై చర్యలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొంటోంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో జరిగిన భేటీలో CJP ప్రతినిధి బృందం ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచింది. లడఖ్ ఉద్యమకారుడు, సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ను తక్షణమే విడుదల చేయాలని, నీట్ పరీక్షల నిర్వహణలో తీవ్ర వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని వారు గట్టిగా ఒత్తిడి తెచ్చారు. అంతేకాకుండా, నీట్ అవకతవకలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
CJP లేవనెత్తిన ఏ ఒక్క కీలక డిమాండ్కు కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణ హామీ ఇవ్వలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనలను, నిరసన కార్యక్రమాలను తక్షణమే విరమించుకోవాలని మాత్రమే మంత్రి జేపీ నడ్డా ప్రతినిధి బృందాన్ని కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశంలో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థుల నిరసనలను కేంద్రం అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. డిమాండ్లపై సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఆందోళనలను మరింత తీవ్రతరం చేసేందుకు సిజేపి సిద్ధమవుతుండగా, కేంద్రం ఈ అంశాన్ని ఎలా సర్దుబాటు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
