Site icon HashtagU Telugu

Earthquake : మహారాష్ట్రలో, అరేబియా సముద్రంలో భూకంపం

Chile Earthquake

Chile Earthquake

Earthquake : గత రెండు నెలలుగా మన దేశంలో ఏదో ఒకచోట భూకంపాలు తరుచుగా సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా సోమవారం తెల్లవారుజామున 5.09 గంటల సమయంలో మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత  3.5గా నమోదైందని తెలిపింది. మహారాష్ట్ర సరిహద్దులోని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న పలుచోట్ల కూడా స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయని తెలుస్తోంది. సోమవారం ఉదయం భూకంప కేంద్రం బయటపడిన హింగోలి జిల్లా.. హైదరాబాద్‌కు 255 కిలోమీటర్ల దూరంలో ఉంది.  ఈ భూకంపం ప్రభావంతో హింగోలి జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదు.

We’re now on WhatsApp. Click to Join.

అరేబియా సముద్రంలో ప్రమాదకర భూకంపం

మహారాష్ట్రలోని హింగోలిలో భూకంపం సంభవించడానికి ముందు..  నవంబర్ 19న(ఆదివారం) సాయంత్రం 6.36 గంటలకు అరేబియా మహా సముద్రంలో కూడా బలమైన భూకంపం సంభవించిందని గుర్తించారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని తెలిపారు. ఇక ఆదివారం ఉదయం 11.30 గంటలకు జమ్మూకశ్మీర్‌లోని దోడాలో 2.6 తీవ్రతతో, ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటలకు 3.9 తీవ్రతతో నేపాల్‌లో భూకంపాలు సంభవించాయి.

భూకంపం ఎలా వస్తుంది ?

భూమి ఉపరితలం క్రింద టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నాయి. ఈ ప్లేట్లు ఒకదానికొకటి తాకుతూ కదులుతూ ఉంటాయి. రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడల్లా.. చోటుచేసుకునే ఘర్షణ కారణంగా శక్తి విడుదల అవుతుంది. ఆ శక్తి తరంగాల రూపంలో భూమి ఉపరితలాన్ని చేరుకుంటుంది. దీని ఫలితంగానే భూమి ఆకస్మిక కదలికలకు లోనవుతుంది. ఈ ప్రక్రియనే మనం భూకంపం అని పిలుస్తాం.

Also Read: Chandrayaan 4 : చంద్రయాన్-4 కోసం ప్లానింగ్.. ఏమేం చేస్తారు ?