Site icon HashtagU Telugu

Delhi Budget: రోల్ మోడ‌ల్ గా ‘ఢిల్లీ’ వార్షిక బ‌డ్జెట్

Delhi

Delhi

చేప‌లు ప‌ట్టివ్వ‌డం కాదు..ప‌ట్టుకోవ‌డం నేర్పించాల‌ని చైనా ర‌చ‌యిత ఎప్పుడో చెప్పిన మాట‌. దాన్ని అక్ష‌రాల ఢిల్లీ ప్ర‌భుత్వం పాటిస్తోంది. ఆప్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ ను చూస్తే ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌రిచేలా రూప‌క‌ల్ప‌న చేసినట్టు స్ప‌ష్టం అవుతోంది. ప్ర‌స్తుతం ఢిల్లీ మొత్తం జనాభాలో 57 లక్షల మంది పౌరులు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని 75 లక్షలకు పెంచాలని కేజ్రీ స‌ర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. వీధి వ్యాపారాల‌ను ప్రోత్స‌హించాల‌ని బ‌డ్జెట్ కేటాయింపు చేయడం అక్క‌డి జ‌న‌రంజ‌క బడ్జెట్ గుర్తు చేస్తోంది.
ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం ఉపాధి రంగంపై దృష్టి సారించిన 8వ వార్షిక బ‌డ్జెట్ ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టాడు. ‘రోజ్‌గార్ బడ్జెట్ `గా పిలుస్తున్న ఈ బ‌డ్జెట్ కోవిడ్ -1 సమయంలో జీవనోపాధిని కోల్పోయిన వారికి ఉద్యోగాలు, ఆహారం , వ్యాపార అవకాశాలను పెంచే పథకాలతో ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

కోవిడ్ 19 కార‌ణంగా ప్రస్తుతం ఉన్న‌ మార్కెట్ ధరల ప్రకారం ఢిల్లీ GSDP 2020-21లో రూ. 7,85,342 కోట్ల నుండి రూ.9,23,967కి పెరిగే అవకాశం ఉంది. 2021-22లో 23,967 కోట్లు అంటే 17.65 శాతం పెరుగుదల” అని సిసోడియా వెల్ల‌డించాడు. ఢిల్లీ ప్ర‌భుత్వం 2022-23 సంవత్సరానికి రూ. 75,800 కోట్ల బడ్జెట్ అంచనాను ప్రతిపాదించింది. 2021-22 సంవత్సరానికి రూ. 69,000 కోట్ల బడ్జెట్ అంచనా కంటే 9.86 శాతం ఎక్కువ. అంతేకాదు, సవరించిన అంచనాల కంటే 13.13 శాతం ఎక్కువ. ఆరోగ్య రంగానికి రూ.9,668 కోట్ల బడ్జెట్‌ను సిసోడియా ప్రకటించాడు. హెల్త్ కార్డ్ చొరవ కోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్ల‌డించాడు. ఢిల్లీ వాసులకు హెల్త్‌కార్డుల కోసం ప్రభుత్వం రూ.160 కోట్లు మంజూరు చేసింది. ఢిల్లీ ప్రజలకు యోగా శిక్షణ అందించే యోగా టీచర్ల కోసం రూ.15 కోట్లు కేటాయిస్తూ బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న చేయ‌డం గ‌మ‌నార్హం.
ఢిల్లీ స‌ర్కార్ ఉద్యోగాలను సృష్టించడం, ఉపాథి క‌ల్పించ‌డం కోసం రూ. 800 కోట్లు కేటాయించింది. అంతేకాదు, ఆ మొత్తాన్ని ఆడిట్ ప‌రిధిలోకి తీసుకొస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మొహల్లా క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, మహిళా మొహల్లా క్లినిక్‌ల నిర్మాణం, అభివృద్ధికి రూ.475 కోట్లు కేటాయించింది. అదనంగా, నాలుగు కొత్త ఆసుపత్రులను నిర్మించడానికి నగరంలో ఉన్న ఆసుపత్రులను తిరిగి అభివృద్ధి చేయడానికి మరియు అప్‌గ్రేడ్ చేయడానికి రూ. 1,900 కోట్లు కేటాయించింది.

ప్రముఖ మార్కెట్‌ప్లేస్‌లను తిరిగి అభివృద్ధి చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. “ఢిల్లీ ప్రభుత్వం 6 నుండి 8 వారాల పాటు రిటైల్ , హోల్‌సేల్ షాపింగ్ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తుంది. అందుకోసం నగరంలోని అనేక ప్రముఖ మార్కెట్‌లను తిరిగి అభివృద్ధి చేయ‌డానికి రూ. 100 కోట్లు కేటాయించింది. సుమారు ఐదు మార్కెట్‌లను తొలి ద‌శ‌లో అభివృద్ధి చేస్తారమ‌ని సిసోడియా అన్నారు. ఢిల్లీలోని స్ట్రీట్ ఫుడ్‌ను పెంచేందుకు డిప్యూటీ సీఎం చర్యలు కూడా ప్రకటించారు. దీని కోసం, ప్రభుత్వం “ఢిల్లీ ఫుడ్ ట్రక్ పాలసీ”ని ప్రారంభిస్తుంది. దీని కింద ఆహార-ట్రక్కులు రాత్రి 8 గంటల నుండి పనిచేస్తాయి. 2 గంటల వరకు ప్రభుత్వం రిటైల్ రంగం, ఆహార పానీయాలు, లాజిస్టిక్స్, టూరిజం, వినోదం, నిర్మాణం, రియల్ ఎస్టేట్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగాలను ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతగా ఎంచుకుంది. గాంధీ నగర్‌లోని మార్కెట్‌ను రెడీమేడ్ గార్మెంట్స్ టెక్స్‌టైల్ రంగంలో ‘గ్రాండ్ గార్మెంట్ హబ్’గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం ద్వారా రాబోయే 5 సంవత్సరాలలో 40,000 కంటే ఎక్కువ కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించగలదని భావిస్తున్నారు. 2022-23 వార్షిక బడ్జెట్‌ను సమర్పిస్తూ..రాబోయే 5 సంవత్సరాలలో ఢిల్లీలో ఉపాధి రేటును 33 శాతం నుండి 45 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేర‌కు సిసోడియా వెల్ల‌డించ‌డం యావ‌త్తు భార‌త‌దేశాన్ని ఆక‌ట్టుకుంటోంది.