తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఢిల్లీ లో బిజీ బిజీ గా గడుపుతున్నారు. రెండో రోజు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(Nadda )ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలపై నడ్డా దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్, రాష్ట్రంలో యూరియా మరియు ఇతర ఎరువుల కొరతపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానే తెలంగాణకు సరఫరా అయిందని, కానీ వ్యవసాయ చరిత్రను దృష్టిలో పెట్టుకుంటే మరో 3 లక్షల టన్నుల యూరియా అత్యవసరంగా అవసరమైందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువుల సరఫరా నిరంతరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Jamili Elections : 2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు – ప్రహ్లాద్ జోషి
రాష్ట్రంలో వర్షాలు మొదలవుతున్న నేపథ్యంలో రైతులు సాగు పనులకు సిద్ధమవుతుండగా, ఈ సమయంలో ఎరువుల కొరత రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందని సీఎం పేర్కొన్నారు. కేంద్రం తక్షణమే అవసరమైన యూరియా సరఫరా చేసి, రాష్ట్రంలోని వ్యవసాయ కార్యకలాపాలకు అండగా ఉండాలని నడ్డాను కోరారు. ఈ సమస్యపై సంబంధిత మంత్రిత్వ శాఖలతో మాట్లాడి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ కావాల్సి ఉంది. ఆయన్ను కలిసే సందర్భంగా కూడా ఎరువుల సరఫరా, రైతులకు పెట్టుబడి సహాయం, కేంద్ర నిధుల విడుదల వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్రంతో సమన్వయం పెంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైన అణువణువునా ప్రయత్నిస్తామని సీఎం చెప్పిన మాటలను ఈ సమావేశాలు కొనసాగిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.