Chhattisgarh High Court: మధ్యప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (MPSRTC) మాజీ బిల్లింగ్ అసిస్టెంట్ జాగేశ్వర్ ప్రసాద్ అవధ్వియాకు 39 సంవత్సరాల తర్వాత న్యాయం లభించింది. 1986లో రూ. 100 లంచం కేసులో లోకాయుక్త వలలో చిక్కుకున్న అవధ్వియాను 2004లో కింది కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్ హైకోర్టు (Chhattisgarh High Court) అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.
కోర్టు తీర్పు- న్యాయ పోరాటం
తగిన సాక్ష్యాలు లేకపోవడం, అనేక లోపాలను కారణంగా చూపుతూ హైకోర్టు దోషిత్వాన్ని రద్దు చేసింది. లంచం డిమాండ్ చేయడం, స్వచ్ఛందంగా అంగీకరించడం నిరూపించబడనంత వరకు కేవలం నోట్ల స్వాధీనం దోషిత్వాన్ని రుజువు చేయడానికి సరిపోదని కోర్టు పేర్కొంది. దాదాపు నాలుగు దశాబ్దాలు సాగిన ఈ న్యాయపోరాటం వల్ల ఆయన ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం పూర్తిగా దెబ్బతిన్నాయి.
Also Read: TS DGP: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు
ఆలస్యమైన న్యాయం
ఈ విజయం తన జీవితాన్ని వెనక్కి తీసుకురాలేదని అవధ్వియా ఆవేదన చెందారు. “సస్పెన్షన్ తర్వాత సగం జీతంతో బతకాల్సి వచ్చింది. నా పిల్లలను మంచి పాఠశాలల్లో చదివించలేకపోయాను. ఇప్పుడు నా చిన్న కొడుకు నీరజ్కు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిరుద్యోగం కారణంగా అతనికి పెళ్లి కాలేదు” అని కన్నీటి పర్యంతమయ్యారు.
కుటుంబంపై ప్రభావం
జాగేశ్వర్ పెద్ద కుమారుడు అఖిలేష్ మాట్లాడుతూ.. “ఈ సంఘటన జరిగినప్పుడు నేను 10వ తరగతిలో ఉన్నాను. నేను చిన్నపాటి పనులు చేసుకుంటూ చదువు ఖర్చులను భరించాల్సి వచ్చింది. కోల్పోయిన సమయాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. న్యాయవ్యవస్థలో సంస్కరణలు రావాలని, నా తండ్రికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను” అని తెలిపారు. అవధ్వియా కథ భారతదేశంలో ఆలస్యంగా లభించే న్యాయం వల్ల ప్రజల జీవితాలపై పడే తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అయినప్పటికీ చివరకు న్యాయం లభించడం ఒక ఆశాజనకమైన విషయం.