Champai Soren : ఝార్జండ్ మాజీ సీఎం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జేఎంఎం సీనియర్ నేత చంపయ్ సోరెన్ సొంతంగా పార్టీ స్థాపిస్తారా? లేక బీజేపీ (BJP)లో చేరతారా? అంటూ కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఈరోజుతో తెరపడింది. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 30న బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని జార్ఖండ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ముందుగానే ప్రకటించారు. అయితే ఇప్పుడు చంపాయ్ సోరెన్ ఇప్పుడు స్వయంగా ధ్రువీకరించారు.
We’re now on WhatsApp. Click to Join.
‘ఈ నెల 18న నేను ఢిల్లీకి వచ్చినప్పుడే నా స్థానం ఏమిటో స్పష్టం చేశాను. వాస్తవానికి ముందుగా నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించాను. కానీ ప్రజలలో నాకున్న మద్దతు చూసి నిర్ణయం మార్చుకున్నా. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా’ అని చంపాయ్ సోరెన్ చెప్పారు. ఈ నెల 30న మీరు బీజేపీలో చేరతారని వార్తలు వినిపిస్తు్న్నాయి, వాస్తవమేనా అన్న మీడియా ప్రశ్నకు చంపాయ్ సోరెన్ అవునని సమాధానం ఇచ్చారు.
కాగా, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భూకుంభకోణం కేసులో అరెస్ట్ కావడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సీనియర్ నాయకుడు చంపాయ్ సోరెన్ను సీఎంగా నియమించారు. అయితే గత నెలలో ఆ కేసులో హేమంత్ సోరెన్కు బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చంపాయ్ సోరెన్తో రాజీనామా చేయించి సీఎం పదవి చేపట్టారు. దాంతో తన నుంచి అవమానకరంగా సీఎం పదవి లాక్కున్నారని చంపాయ్ సోరెన్ మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలో తదనంతర పరిణామాలు చోటుచేసుకున్నాయి.